సికింద్రాబాద్ : ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో భద్రతా వైఫల్యం బయటపడింది. డాక్టర్ కోటు వేసుకుని వచ్చిన ఓ కిలాడీ మహిళ.. చికిత్స పేరుతో రోగికి మత్తు మందు ఇచ్చి, ఒంటిపై ఉన్న పది తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించింది. ఈ సంచలన ఘటన సికింద్రాబాద్లోని యశోద హాస్పిటల్లో చోటుచేసుకుంది.
పాత బోయిన్పల్లికి చెందిన సుధారాణి అనే మహిళ అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆమె కోలుకోవడంతో మార్చి 12 (గురువారం) నాడు డిశ్చార్జ్ కావాల్సి ఉంది.
సరిగ్గా అదే సమయంలో తెల్లకోటు ధరించి, స్టెతస్కోప్తో డాక్టర్లా నటించిన ఒక గుర్తు తెలియని మహిళ సుధారాణి ఉన్న గదిలోకి ప్రవేశించింది.
పరీక్షలు చేయాలని చెప్పి గదిలో ఉన్న బాధితురాలి బంధువులను సదరు మహిళ బయటకు పంపించింది. అనంతరం సుధారాణికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చింది.
బాధితురాలు స్పృహ కోల్పోగానే, ఆమె ఒంటిపై ఉన్న సుమారు 10 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించి అత్యంత చాకచక్యంగా అక్కడి నుంచి పారిపోయింది.
కొంతసేపటి తర్వాత బంధువులు గదిలోకి వెళ్లి చూడగా సుధారాణి స్పృహ లేకుండా పడి ఉంది. ఒంటిపై నగలు మాయమవ్వడంతో ఆందోళన చెందిన బంధువులు ఆసుపత్రి సిబ్బందిని నిలదీశారు. అయితే ఆ మహిళ తమ ఆసుపత్రి వైద్యురాలు కాదని యాజమాన్యం సమాధానమివ్వడంతో బాధితులు షాక్కు గురయ్యారు.
బాధితుల ఫిర్యాదుతో మార్కెట్ పోలీసులు రంగంలోకి దిగారు.
ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, నిందితురాలు నర్సింగ్ స్టాఫ్ గదిలోకి వెళ్లి రావడం రికార్డైంది. ఇంత పెద్ద ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి డాక్టర్ వేషంలో తిరుగుతున్నా ఎవరూ గమనించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
#sidhumaroju
Alwal










