ముంబై-హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ బస్ట్… నైజీరియన్ మహిళ అరెస్ట్.|

0
11

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు కొకైన్ తరలిస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ ఎక్సైజ్ డిటిఎఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముంబై నుంచి నగరానికి భారీగా మాదకద్రవ్యాలు రవాణా జరుగుతున్నాయన్న గోప్య సమాచారం అందడంతో డిటిఎఫ్ సిఐ సౌజన్య, ఎస్సై శివకృష్ణ బృందం అప్రమత్తమైంది. పారడైజ్ పరిసరాల్లోని సన్‌షైన్ హాస్పిటల్ ప్రాంతంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, ఆటోలో వచ్చిన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితురాలు వద్ద ఐదు ప్యాకెట్లలో దాచిన 7.5 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ సుమారు రూ.2.35 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. ముంబైలో గ్రాముకు రూ.15,000కి కొనుగోలు చేసిన కొకైన్‌ను హైదరాబాద్‌లో గ్రాముకు రూ.30,000కి విక్రయించేందుకు నిందితురాలు తీసుకువచ్చినట్లు తెలిసింది. ఈ రాకెట్ వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

అరెస్ట్ చేసిన నిందితురాలిని తదుపరి విచారణ కోసం సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రగ్స్ పట్టుకున్న డిటిఎఫ్ బృందాన్ని హైదరాబాద్ డీసీపీ అనిల్ కుమార్ రెడ్డి, ఏఎస్ శ్రీనివాసరావు అభినందించారు.

నగరంలో డ్రగ్స్ అక్రమ రవాణాపై పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

#sidhumaroju

Alwal