సికింద్రాబాద్.. మారువేషం ధరించి రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ కిలాడీ లేడిని వారసి గూడ పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి నుండి 8 లక్షల విలువైన నగదు బంగారు వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తూర్పు మండల అదనపు డిసిపి నరసయ్య తెలిపారు. మచ్చ బొల్లారం ప్రాంతానికి చెందిన గడ్డమీద విజయా అనే మహిళ రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈనెల 23వ తేదీన వారాసి గూడ లో దుర్గా అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో దొంగతనం చేసినట్లు పోలీసులు వెల్లడించారు..దొంగతనం చేసే క్రమంలో ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీరలో వచ్చి దొంగతనం చేసి మారు వేషంలో బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.చీరలో వచ్చిన విజయ ఇంట్లో తాళాలు పగలగొట్టి అల్మారలో ఉన్న నగదు విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకొని ప్యాంట్ షర్ట్ మాస్క్ ధరించి పరారైనట్లు పోలీసులు తెలిపారు. తీర్థయాత్రల కోసం కుటుంబం శ్రీకాళహస్తికి వెళ్లిన నేపథ్యంలో దొంగతనం జరిగినట్లు స్థానికులు సమాచారం ఇచ్చారని పోలీసులు తెలిపారు. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వారసి గుడా పోలీసులు 500 సీసీ కెమెరాలు పరిశీలించి నిందితురాలు విజయ ను పట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇదివరకే దుర్గా కు విజయ పరిచయం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.