సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవాని సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తన లక్ష్యమని కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ లో మడ్ ఫోర్డ్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో ఏర్పాటుచేయనున్న మోడల్ కాలని ఏర్పాటు కోసం ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్థలపరిశీలనకు సంబంధించి తిరుమలగిరి రెవెన్యూ అధికారుల సమక్షంలో రేపటి నుండి సర్వే చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కంటోన్మెంట్ లో మోడల్ కాలనీ నిర్మాణం కోసం మొత్తం 18 బస్తీలలో ఈ సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇండ్ల కోసం రేపటి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో వారి వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు. ఇండ్ల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని సంబంధిత అధికారులతో చర్చలు కూడా సానుకూలంగా జరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రెండు మూడు రోజుల్లో రసూల్ పురా లో నారాయణ జోపిడి లో రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి నిర్మాణం జరుగుతుండగానే లక్కీ డ్రా ని కూడా నిర్వహించి ఇండ్ల కేటాయింపు జరుపుతామని, లబ్దిదారులు తమ ఇండ్ల నిర్మాణ నాణ్యత తామే పర్యవేక్షించుకునే వీలు కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కంటోన్మెంట్ ప్రాంతంలో పేద ప్రజలకు సొంత ఇండ్ల పట్టాలు ఇవ్వలేని దుస్థితిలో గత ప్రభుత్వాలు ఉండేవని ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పేదలకు న్యాయం చేయడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిశీలన కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్, డిప్యుటీ తహసీల్దార్, కాంగ్రెస్ నాయకులు, బస్తీల ప్రజలు పాల్గొన్నారు.