సికింద్రాబాద్.. ద్విచక్ర వాహనంపై వెళ్తూ సొమ్మసిల్లి రహదారిపై కుప్పకూలినట్లు నటిస్తారు.వెంటనే రహదారిపై వెళ్లే వాహనదారులు వారిని చూసి సహాయం చేసేందుకు వారి వద్దకు రాగానే వారి పాకెట్ లో నుండి సెల్ ఫోన్ అపహరించుకొని ఉడాయిస్తారు. ఈ కొత్త తరహా దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ముగ్గురు యువకులను ఎట్టకేలకు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. వాహనదారుల,ప్రయాణికుల దృష్టిమరల్చి చరవాణులను అపహరిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను బోయిన్ పల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుండి 25 లక్షలు విలువైన 77 చరవాణిలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు బేగంపేట ఏసిపి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన గంటా చిన్న ఆటో డ్రైవర్ గా, ప్రధాన్ శ్రీకాంత్, ఆవుల గోపి రావు లు వృత్తి రీత్యా కూలీలుగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. 2017లో హైదరాబాద్ నగరానికి వచ్చిన ప్రధాన నిందితుడు గంటా చిన్న దిల్ సుఖ్ నగర్ లో అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అదే సమయంలో సెల్ ఫోన్ చోరీలకు పాల్పడే ముఠాతో సంబంధాలు ఏర్పరచుకొని వాళ్లకు సహాయకుడిగా ఉండేవాడని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం ఒరిస్సా కు చెందిన శ్రీకాంత్, గోపి రావులతో కలిసి స్వయంగా సెల్ ఫోన్ దొంగతనాలు చేయడం అలవర్చుకున్నారు. గత కొన్నేళ్లుగా హైదరాబాదులోని మూడు కమిషనరేట్ల పరిధిలో వాహనదారులు, ప్రయాణికుల నుండి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. బోయిన్ పల్లి లో తాడ్ బంద్ కూడలి వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్లు లేకుండా అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా సెల్ ఫోన్ స్నాచర్లుగా తేలినట్లు ఎసిపి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. ఇటీవల జరిగిన సెల్ ఫోన్ దొంగతనాలకు సంబంధించి సీసీ కెమెరాలు పరిశీలించిన అనంతరం ఈ ముగ్గురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే సెల్ఫోన్ దొంగతనాలకు పాల్పడినట్లు నిర్ధారించారు.