సికింద్రాబాద్.. తిరుమలగిరిలో ఆర్మీ అధీనంలో ఉన్న ప్రాంతంలోకి అక్రమంగా చొరబడిన నలుగురు వ్యక్తులను తిరుమలగిరి పోలీసులు అరెస్టు చేశారు.తిరుమలగిరిలోని మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఇంజనీరింగ్ (MCEME) కళాశాల టెక్నో చౌక్ గేటులోకి అనుమతి లేకుండా నకిలీ వైమానికదళ అధికారి గుర్తింపు కార్డులతో ఎయిర్ ఫోర్సు దుస్తులను లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. అనుమతి లేకుండా ఆర్మీ రహస్య ప్రాంతంలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరిస్తుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ అధికారులు వారిని ప్రశ్నించారు. ఆర్మీ ప్రాంతంలోని కీలక సమాచారంపై ఫోటోలు, వీడియోలు తీసుకోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం కావడంతో వెంటనే వారిని అదుపులోకి తీసుకున్న ఎయిర్ ఫోర్స్ ఇంటెలిజెన్స్ అధికారులు అన్ని కోణాలలో విచారించి తిరుమలగిరి పోలీసులకు అప్పగించారు.లెఫ్టినెంట్ కల్నల్ ఫిర్యాదుతో తిరుమలగిరి పీఎస్లో కేసు నమోదు అయింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని పేరుతో వాళ్లు లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ మరి ఏదైనా జాతీయ భద్రత అంశం సంబంధించిన కోణం లో కూడా దర్యాప్తు జరుపుతున్నారు.అనుమానాస్పదంగా తిరుగుతూ ఫోటోలు వీడియోలు తీసుకున్న నలుగురు వ్యక్తులను (ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు) రాకేష్ కుమార్, ఆశిష్ కుమార్, ఆలియా అబ్షీ, నగ్మభానూ లు పోలీసుల విచారణలో ఉన్నారు.