*వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్*
మహబూబాబాద్ జిల్లా తోర్రూరు,డిసెంబర్12:ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల ముసుగులో బలవంతపు వసూళ్లు చేస్తున్న ఓ యూట్యూబ్ డిజిటల్ ఛానల్ యాంకర్ గా పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తొర్రూరు ఎస్సై ఉపేందర్ తెలిపారు. గురువారం అరెస్టు చేసిన సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బుధవారం సాయంత్రం 4.30 గంటలకి ములుగు నివాసి ధరావత్ ఆనంద్ పోచంపల్లి గ్రామం పెద్ద వంగరలో తన బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో
పాలకేంద్రం దగ్గర ఆగి అక్కడి వైన్ షాప్ లో లిక్కర్ కొనుక్కొని తన కారులో వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు పోలీస్ సైరన్ ఉన్న కారులో వారిని వెంబడించి, దారి మధ్యలో అడ్డగించి వారిని మేము ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులమని,కారును చెక్ చేసి, కారులోని మద్యం పట్టుకొని ఇప్పుడు మీ మీద కేసు అవుతుందని రూ.1లక్ష రూపాయలు ఇస్తేనే మిమ్మల్ని వదులుతామని బెదిరించారని, ఆ క్రమంలో ధరావత్ ఆనంద్ మరియు డ్రైవర్ కుమార్ ను అతని కారును బంధించగా ఇతను బెదిరిపోయి వాళ్ల బామ్మర్ది దగ్గర అప్పటికప్పుడు ఒక లక్ష రూపాయలను
సర్దుబాటు చేసి, వీరికి ఇచ్చి కారును అతని డ్రైవర్ ను విడిపించుకున్నారని తెలిపారు. ముగ్గురు వ్యక్తులలో ఒకతను సివిల్ డ్రెస్ లో ఉండగా మిగతా ఇద్దరు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నట్లు తెలిపారు. బుధవారం రాత్రి అతన్ని వాళ్ళ ఇంటి వద్ద పట్టుకుని అరెస్టు చేసి, అతని వద్దనుండి నేరానికి వాడిన కారు, బాధితుల దగ్గర నుండి వసూలు చేసిన రూపాయలలో ఇతను తీసుకున్న రూపాయలు 50,000 అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.మిగతా ఇద్దరి నేరస్తుల్లో ఒకరు ఒక ప్రముఖ వార్త పత్రికలో తొర్రూరు విలేకరిగా, మరొకరు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ లో రిపోర్టర్ గా పనిచేస్తున్నారని, వారిని పట్టుకుని కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు.
