*తరుచూ తాగునీటి పరీక్షలు చేపట్టాలి*
*మూడు రీజియన్లల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లు*
*ప్రజల కోణంలో ఆలోచించే ప్రభుత్వ సేవలందించాలి*
*ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష*
*అమరావతి, డిసెంబర్ 22:* ప్రజల కోణంలో ఆలోచించేలా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. క్షేత్ర స్థాయిలో అందుతున్న సేవలు ఏ విధంగా అందుతున్నాయనే అంశంపై ఆరా తీశారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ప్రజలకు సంతృప్తికరంగా సేవలందించాలి. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలి. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, కార్యక్రమాలను ప్రజలు ఎలా చూస్తున్నారనే కోణంలో విశ్లేషించాలి.
దానికి అనుగుణంగా సేవలందించడంలో మార్పులు చేర్పులు చేసుకోవాలి. గంజాయి కట్టడిపై పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలి… రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు మరింతగా అమలు చేయాలి. గంజాయి కట్టడిపై మూడు రీజియన్లల్లో చేపట్టే అవగాహన కార్యక్రమాల్లో నేనూ పాల్గొంటాను. గంజాయి నివారణకు, డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చాలా వరకు మంచి ఫలితాలు వస్తున్నాయి.
అయినా అందర్నీ భాగస్వాములను చేసేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించేలా కార్యక్రమాలు రూపొందించాలి. గంజాయి, డ్రగ్స్ కు సంబంధించి మూడు ప్రాంతాల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లను ఏర్పాటు చేద్దాం. అమరావతి, తిరుపతి, విశాఖల్లో డీ-ఎడిక్షన్ సెంటర్లు పెట్టండి. ప్రభుత్వం చేపట్టే వివిధ పథకాల్లో ప్రజా భాగస్వామ్యం ఉండేట్టుగా చూడాలి. వీధి దీపాలు, తాగునీటి సరఫరా విషయంలో ఎలాంటి ఫిర్యాదులు రాకూడదు. సరఫరా చేసే తాగునీటికి సంబంధించిన పరీక్షలు చేపట్టాలి.
వాటిని ప్రజలకూ వివరించాలి. ఎక్కడైనా తాగునీటిలో కలుషితం జరిగిందని వెల్లడైతే… అలెర్ట్ కావాలి. హాస్టళ్లల్లో తాగునీటి, పారిశుద్ధ్యం వంటి విషయాల్లో ఏ మాత్రం అలక్ష్యం చేయొద్దు. ఆర్వో ప్లాంట్లు లేని హాస్టళ్లల్లో త్వరితగతిన ప్లాంట్లను ఏర్పాటు చేయండి.
క్షేత్ర స్థాయి సిబ్బంది తప్పనిసరిగా కార్యాలయాలకు రావాల్సిందే. ఫైళ్ల మానిటరింగ్, అటెండెన్స్ వంటి అంశాలను ఆర్టీజీ సెంటర్ ఎప్పటికప్పుడు నివేదించాలి.”అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎస్ విజయానంద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
