ఇంద్రకీలాద్రిపై కేశఖండన శాల వెంట్రుకల వేలం ప్రక్రియ పూర్తి* – *సుమారు 80% మేర పెరిగిన దేవస్థానం ఆదాయం*.
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) లో భక్తులు సమర్పించే వెంట్రుకల విక్రయానికి సంబంధించి రెండేళ్ల కాల పరిమితి (2026-2028) కు గాను నిర్వహించిన టెండర్ ప్రక్రియ సోమవారం ఘనంగా ముగిసింది. గత టెండర్లతో పోలిస్తే ఈసారి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది.
*వేలం వివరాలు*
ఈ టెండర్ ప్రక్రియను ఆలయ ఈఓ వి.కె. సీనా నాయక్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పి. రాఘవ రాజు, అవ్వారు శ్రీనివాసరావు, ఎం. శ్రావణి,ఏసీ ఆఫీస్ వేలం ఇన్ఛార్జ్ కె. విక్రమ్ పాల్గొన్నారు.
పబ్లిక్ అక్షన్ (బహిరంగ వేలం): ఇందులో 19 మంది వ్యాపారులు పాల్గొన్నారు.
సీల్డ్ టెండర్: 13 షెడ్యూల్స్ విక్రయించగా, 4 గురు పాల్గొన్నారు. ఇందులో ప్రోద్దుటూరుకు చెందిన కె.వి. నరసమ్మ రూ. 9,57,00,000/- తో అత్యధిక ధర పలికారు.
ఈ-టెండర్: 4 గురు పాల్గొనగా, తిరుపతికి చెందిన గరుడ ఎంటర్ప్రైజెస్ రూ. 9,09,99,999/- కోట్ చేశారు.
విజేత వివరాలు
అంతిమంగా నిర్వహించిన రెండేళ్ల టెండర్ ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లా, తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ (మేనేజింగ్ డైరెక్టర్: వి. రవీంద్ర నాథ్) అత్యధిక ధరకు టెండర్ను దక్కించుకున్నారు.
ఆదాయం పెరుగుదల గణాంకాలు
గత టెండర్ కాలం (2024-26) తో పోలిస్తే, ప్రస్తుత వేలంలో దేవస్థానానికి రికార్డు స్థాయిలో ఆదాయం పెరిగింది.
మొదటి ఏడాది (2026-27): గతంలో రూ. 5,67,57,000/- ఉండగా, ఇప్పుడు అది రూ. 10,10,00,000/- కు చేరింది (సుమారు 77.96% పెరుగుదల).
రెండవ ఏడాది (2027-28): గతంలో రూ. 6,18,05,700/- ఉండగా, 10% అదనపు పెంపుతో కలిపి రూ. 11,11,00,000/- కు చేరింది (సుమారు 80.08% పెరుగుదల).
పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా దేవస్థానానికి గతంతో పోలిస్తే భారీగా ఆదాయం పెరగడం పట్ల అధికారులు మరియు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.




