ఆర్.సి.ఎమ్ చర్చ్ ను సందర్శించిన ఎంపీ కేశినేని శివనాథ్
బిషప్ జోసప్ రాజారావు కు నూతన సంవత్సర శుభాకాంక్షలు
విజయవాడ : తూర్పు నియోజకవర్గం స్టేల్లా కాలేజీ రోడ్డులోని మాతా టవర్స్ పక్కన గల ఆర్.సి.ఎం చర్చ్ ను సోమవారం ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. బిషప్ జోసప్ రాజారావు, వికార్ జనరల్ పాదర్ మువ్వల ప్రసాద్ చర్చ్ కు విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ కు పుష్పగుచ్ఛం అందించి శాలువాతో ఆత్మీయ సత్కారం చేశారు.
“సమాజంలో మానవత్వం, సహనం, సౌహార్దాన్ని పెంపొందించడంలో చర్చిల సేవలు ఎనలేనివి. ప్రజల మధ్య ఐక్యతను బలోపేతం చేసే కార్యక్రమాలు అభినందనీయం. రాబోయే నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శాంతి, ఆరోగ్యం, సంతోషాన్ని నింపాలి” అంటూ బిషప్ జోసప్ రాజారావు కు ఎంపీ కేశినేని శివనాథ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
“ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ పనిచేస్తున్న ఎంపీ కేశినేని శివనాథ్ సేవా దృక్పథం ప్రశంసనీయం. ఆయనకు దేవుని కృప ఎల్లప్పుడూ ఉండాలి” అంటూ బిషప్ జోసప్ రాజారావు ఆకాంక్షించారు. అనంతరం బిషప్ జోసప్ రాజారావు తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు.
అనంతరం వీరిద్దరూ సమాజాభివృద్ధి, యువతకు నైతిక విలువల బోధన, సేవా కార్యక్రమాల విస్తరణ అంశాలపై కాసేపు చర్చించుకున్నారు. ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమానికి తన వంతు మద్దతు కొనసాగుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు ఊర్ల మోహనరావు, ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ క్రిస్టియన్ నాయకులు ఇత్తడి చార్లెస్, చాట్ల రాజశేఖర్, డాక్టర్ సంకే విశ్వనాథం, ఎన్.ఐ.ఆర్.డి ఎన్టీఆర్ జిల్లా అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహా చౌదరి, మాజీ కార్పొరేటర్ ఇత్తడి నాగలక్ష్మీ, టి.ఎన్.టి.యు.సి రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరుచూరి ప్రసాద్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.






