ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి ఏటా నీటి బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. 2026-27 నీటి సంవత్సరానికి గాను, రాష్ట్రానికి 1,565 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని, అవసరాలు 1,490 టీఎంసీలుగా అంచనా వేసింది
. దీంతో 75 టీఎంసీల నీటి మిగులు ఉంటుందని భావిస్తున్నారు. ఈ బడ్జెట్ ద్వారా నీటి వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏపీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెడుతుంటాయి. గతంలో రైల్వేకి ప్రత్యేక బడ్జెట్ ఉండేది. ఇప్పుడు దాన్ని కూడా ఆర్థిక బడ్జెట్లో కలిపేశారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం మరో రంగానికి ప్రత్యేకంగా బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచన చేస్తుంది. ఇకపై ప్రతి ఏటా నీటి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించుకుంది.
రాష్ట్రం ప్రభుత్వం తొలిసారి నీటి నిర్వహణకు గాను నీటి బడ్జెట్ను రూపొందించనుంది. 2026-27 నీటి సంవత్సరానికి గాను, జలవనరుల శాఖ ఈ బడ్జెట్ను సిద్ధం చేసింది. ఈ బడ్జెట్ ప్రకారం 2026-27 నీటి సంవత్సరానికి (జూన్ 1 నుంచి మే 31 వరకు) రాష్ట్రానికి 1,565 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేయగా, ఏడాది పాటు రాష్ట్రానికి పలు రంగాలకు సంబంధించి 1,490 టీఎంసీలు వినియోగిస్తారని తేల్చారు. దీంతో 75 టీఎంసీల నీటి మిగులు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఈ నీటి బడ్జెట్ ద్వారా రాష్ట్రంలో నీటి వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సాధారణంగా నీటి లభ్యతను లెక్కించడానికి.. గత సంవత్సరాల నీటి సరఫరా తీరును ఆధారంగా చేసుకుంటారు. జిల్లాల్లో నీటి అభివృద్ధి మండలి సమావేశాల్లో, తుంగభద్ర వంటి బోర్డుల్లో ముందుగానే నీటి అంచనాలను లెక్కిస్తారు. వాతావరణ అంచనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
ఈ పద్ధతిలో లెక్కించినప్పుడు, రాష్ట్రంలోని నదుల ద్వారా వచ్చే నీటి సంవత్సరంలో రాష్ట్రానికి 1,565 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేశారు.
ప్రస్తుత నీటి సంవత్సరంలో, జూన్ నాటికి 133 టీఎంసీల నీరు వినియోగానికి అందుబాటులో ఉంటుందని అంచనా. జనవరి 1, 2026 నాటికి 504 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. ఇందులో భారీ నీటిపారుదల ప్రాజెక్టుల్లో 475 టీఎంసీలు, మధ్య తరహా ప్రాజెక్టుల్లో 29 టీఎంసీలు ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని జలాశయాల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 1,106 టీఎంసీలు. అయితే, వినియోగించుకోవడానికి వీలుగా 846 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. మిగిలిన నీరు డెడ్స్టోరేజి కిందకు వస్తుంది.
ఈ సంవత్సరం మే నెలాఖరు వరకు రాష్ట్రంలో 412 టీఎంసీల నీటి అవసరాలు ఉంటాయని అధికారులు తేల్చారు. ఇందులో తాగునీటికి 77 టీఎంసీలు, రబీ సాగుకు 318 టీఎంసీలు, పరిశ్రమలకు 17 టీఎంసీలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ అవసరాలన్నింటికి కేటాయించిన తర్వాత..
నీటి సంవత్సరం ప్రారంభం నాటికి 133 టీఎంసీల నీరు వినియోగానికి అందుబాటులో ఉంటుందని తెలిపారు. పులిచింతలలో ఉన్న 41 టీఎంసీలను కూడా ఈ లెక్కల్లో చేర్చారు. దీనివల్ల వచ్చే ఖరీఫ్ సీజన్ను ముందుగానే ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
గత ఐదేళ్లుగా చూసుకుంటే.. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల నుంచి సగటున 2,308 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఈ మొత్తంలో భారీ జలాశయాల నుంచి 1,815 టీఎంసీలు, మధ్య తరహా ప్రాజెక్టుల నుంచి 493 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దీని ప్రకారం చూస్తే.. రాబోయే నీటి సంవత్సరంలో 1,565 టీఎంసీల లభ్యత ఉంటుందని జలవనరుల శాఖ అంచనా వేసింది. అవసరాలకు సరిపడా నీరు అందుబాటులో ఉండటమే కాకుండా, మిగులు కూడా ఉంటుందని వారి అంచనా. ఈ లెక్కలకు మరిన్ని తుది మెరుగులు దిద్దుతున్నారు.
