జైల్లో మామ అంబటిని కలిసిన అల్లుడు ఉపేష్
ఆవేశంలో అంబటి నోరు జారారని వ్యాఖ్య
అంబటికి సినిమా చూపిస్తామని పెమ్మసాని అనడం కరెక్ట్ కాదన్న ఉపేష్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు పశ్చాత్తాపం చెందుతున్నారని ఆయన అల్లుడు ఉపేష్ తెలిపారు. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న అంబటిని సోమవారం మధ్యాహ్నం ఆయన ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ శ్రేణులే ముందుగా రెచ్చగొట్టేలా ప్రవర్తించారని, ఆ ఒత్తిడిలో అంబటి మాట జారారని ఉపేష్ ఆరోపించారు. సీఎంపై అసభ్యంగా మాట్లాడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ, దాడులు చేయడం సరికాదన్నారు. అంబటికి సినిమా చూపిస్తామంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
గుంటూరులోని తమ ఇంటిపై పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త, అనుచరులు కలిసి దాడి చేశారని ఉపేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో నమోదైందని, వాటి ఆధారంగా నిందితులపై కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. “ఏ పార్టీ కూడా ఎల్లప్పుడూ అధికారంలో ఉండదనే విషయం గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలే పునరావృతం కావొచ్చు” అని ఆయన హెచ్చరించారు.
కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేయగా, గుంటూరు కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. మరోవైపు, అంబటి వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడానికే తాను వెళ్లానని, దాడిని ప్రోత్సహించలేదని ఎమ్మెల్యే గల్లా మాధవి ఇప్పటికే వివరణ ఇచ్చారు.






