Home South Zone Andhra Pradesh రహదారుల అభివృద్ధికి పక్కా ప్రణాళిక: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

రహదారుల అభివృద్ధికి పక్కా ప్రణాళిక: ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

0

బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు సూచన మేరకు ప్రధాన రహదారులకు నిధులు కేటాయించారు. కర్లపాలెం మండలం పేరలి గ్రామం నుండి తుమ్మలపల్లి వయా పెర్లమ్మ ఆలయ వరకు రహదారి నిర్మాణానికి రెండు కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వెల్లడించారు.

కొన్ని దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న ఆందోళన పై స్పందించిన ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు చేసిన కృషి ఫలితంగా ఒక చక్కటి రహదారికి మార్గం సుగమం అయింది. బాపట్ల మండలం పూండ్ల రహదారి నుండి మర్రిపూడి మాలపల్లి వరకు 81 ఒక్క లక్షల రూపాయలతో రహదారి నిర్మించనున్నారు.

నిధులను మంజూరు చేయటంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కృతజ్ఞతలు తెలిపారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గతంలో అనేక రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన విషయాన్ని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గుర్తు చేశారు. తిరిగి మరో రెండు రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి అమలుకు నోచుకొని రహదారులకు యుద్ధ ప్రాతిపదికపై చర్యలు తీసుకొని అందమైన రహదారులకు రూపకల్పన చేస్తామని చెప్పారు.

మరికొన్ని రోడ్ల నిర్మాణానికి ఇప్పటికే ప్రతిపాదనలు చేసి ఉన్నామని వెల్లడించారు. త్వరలోనే ఆయా నిధులు మంజూరు అవుతాయని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ చెప్పారు. గుంతలు లేని రహదారులు నిర్మించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో అనేక రహదారుల పరిస్థితిపై నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో రహదారులను కలిపే అనుసంధాన రోడ్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. బాపట్ల నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా రోడ్ల నిర్మాణానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ రాజు వెల్లడించారు

NO COMMENTS

Exit mobile version