పామాయిల్ సాగు చరిత్రలో తొలిసారి తెలంగాణకన్నా ఏపీలోనే అధిక ధర
– రైతులకు గిట్టుబాటు ధర…కూటమి ప్రభుత్వ నిర్ణయాలకు హర్షం
– మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి పామాయిల్ రైతుల ప్రత్యేక కృతజ్ఞతలు
*అమరావతి, ఫిబ్రవరి 5:* పామాయిల్ పంట సాగు చరిత్రలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లోనే అధిక ధర లభించడం రాష్ట్ర రైతుల్లో ఆనందోత్సాహాలను నింపింది. ఈ చారిత్రాత్మక పరిణామానికి కారణమైన కూటమి ప్రభుత్వ నిర్ణయాల పట్ల పామాయిల్ రైతులు, పామాయిల్ అసోసియేషన్ సభ్యులు వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇతర సంప్రదాయ పంటల నుంచి పామాయిల్ సాగు వైపు రైతులు పెద్ద సంఖ్యలో మొగ్గుచూపుతున్నారని, కూటమి ప్రభుత్వ విధానాల వల్ల తొలిసారి పామాయిల్ రైతులు నిజమైన సంతృప్తిని పొందుతున్నారని రైతులు ఈ సందర్భంగా తెలిపారు.
ముఖ్యంగా సరైన సమయంలో ఉన్నతమైన గిట్టుబాటు ధరను ప్రకటించడం వల్ల రైతులకు ఆర్థిక భరోసా కలిగిందని, పామాయిల్ సాగు విస్తరణ వల్ల రాష్ట్రంలో క్రాప్ డైవర్సిఫికేషన్ విజయవంతంగా అమలవుతోందని రైతులు పేర్కొన్నారు. ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా పామాయిల్ సాగు రైతులకు భరోసాగా మారిందన్నారు. అలాగే సాగు వ్యయాన్ని తగ్గించేలా డ్రిప్ పరికరాలపై సబ్సిడీని సరైన సమయంలో అందించడం
ప్రభుత్వం తీసుకున్న అత్యంత కీలక నిర్ణయమని ప్రశంసించారు. పంట దిగుబడి వచ్చిన వెంటనే సరైన సమయంలో గిట్టుబాటు ధరను కల్పించడం వల్ల మార్కెట్ ఒడిదుడుకులకు భయపడాల్సిన అవసరం లేకుండా రైతులు సంతోషంగా ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు పామాయిల్ సాగుకు కొత్త దిశను చూపుతున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ దూరదృష్టి గల నిర్ణయాలతో రానున్న రోజుల్లో పామాయిల్ సాగు మరింత విస్తరిస్తుందని, రాష్ట్రం ఆయిల్ పామ్ ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన, సీఎం చంద్రబాబు సారధ్యంలో, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నాయకత్వంలో వ్యవసాయ రంగం మరింత బలోపేతం అవుతుందని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
రైతులకు రికార్డు ధర… మెట్రిక్ టన్నుకు రూ. 20,680 : మంత్రి అచ్చెన్నాయుడు
2025-26 ఆయిల్ ఇయర్ (నూనె సంవత్సరం) కు గాను 20.01% ఆయిల్ ఎక్సట్రాక్షన్ రేషియో (OER) ను ప్రభుత్వం ప్రకటించిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. మన రాష్ట్ర పామ్ ఆయిల్ రైతులకు మెట్రిక్ టన్నుకు రూ. 20,680/- ధర లభించిందని, జనవరి నెలకు గాను తెలంగాణ రాష్ట్ర పామ్ ఆయిల్ రైతులకు మెట్రిక్ టన్నుకు రూ.20,456/- లు లభించగా.
మన రైతులకు రూ. 20,680/- ల ధర లభించిందని అన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల తెలంగాణ కన్నా మన రైతులకు మెట్రిక్ టన్నుకు రూ. 224/- అదనంగా లభించిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్ విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకతలో దేశంలోనే తొలి స్థానంలో ఉందని, రాష్ట్రవ్యాప్తంగా 1.97 లక్షల మంది రైతులు 2.49 లక్షల హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ, లాభదాయక పంటగా మలుస్తున్నారని అన్నారు.
2024–25 నూనె సంవత్సరానికి ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల ఆయిల్ పామ్ రైతులకు మెట్రిక్ టన్నుకు సగటున రూ.19,579 ధర లభించిందని, ఇది గత పదేళ్లలోనే అత్యధికమని మంత్రి వెల్లడించారు. ఈ ధరలతో రైతుల్లో విశ్వాసం పెరిగి ఆయిల్ పామ్ సాగుపై సానుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 24,535 హెక్టార్లలో కొత్త ఆయిల్ పామ్ తోటల విస్తరణ సాధించామని, ఇది గత దశాబ్దంలోనే రికార్డుగా నిలిచిందని తెలిపారు. ఇప్పటివరకు రూ.181.28 కోట్ల నిధులు విడుదల చేసి, రూ.137.28 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని పేర్కొన్నారు.
జాతీయ నూనె గింజల మిషన్ కింద రైతులకు ఉచిత మొక్కలు, సాగు ప్రోత్సాహకాలు, పరికరాలపై భారీ రాయితీలు అందిస్తూ ఆయిల్ పామ్ను రాష్ట్రంలో భవిష్యత్తు పంటగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.




