విద్యాలయాల వసతి గృహాలే లక్ష్యంగా దొంగతనాలు – అంతరాష్ట్ర నిందితుడి అరెస్ట్
హాస్టళ్లే టార్గెట్… ‘లా’ చదివిన ల్యాప్టాప్ లు దొంగతనం
11 రాష్ట్రాలు, 61 కేసులు… మంగళగిరిలో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్
పీజీ అడ్మిషన్ల ముసుగులో దొంగతనాలు – పోలీసుల చాకచక్యంతో గుట్టురట్టు
నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ
విశ్వవిద్యాలయాలు, జాతీయ స్థాయి విద్యాసంస్థలు, వైద్య కళాశాలల బాలుర వసతి గృహాలను లక్ష్యంగా చేసుకుని ల్యాప్టాప్ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక అంతరాష్ట్ర నిందితుడిని మంగళగిరి గ్రామీణ పోలీసులు అరెస్ట్ చేసినట్లు నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీకృష్ణ తెలిపారు.గురువారం మంగళగిరి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ లా చదివి ల్యాప్ టాప్ లు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ఆయన చెప్పారు. అమృత విశ్వవిద్యాపీఠం సీనియర్ వార్డెన్ మోహనకృష్ణ ఫిర్యాదు మేరకు మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, గ్రామీణ సీఐ ఏ.వి. బ్రహ్మం, గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు..అతని వద్ద నుంచి మొత్తం 15 ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు మురళీకృష్ణ వెల్లడించారు. వీటి అంచనా విలువ సుమారు రూ.12 లక్షలుగా
తెలిపారు.
అరెస్టైన నిందితుడిని పతమిళ్ సెల్వన్ (29), కన్నన్ కుమారుడు, తిరువారూర్ జిల్లా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.ప్రాథమిక విచారణలో ఇతడు దేశంలోని 11 రాష్ట్రాల్లో 61 ల్యాప్టాప్ దొంగతనాల కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు తెలిసిందని అన్నారు.సీసీ కెమెరాల దృశ్యాలు, రవాణా వాహనాల వివరాలు,సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి చాకచక్యంగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.నిందితుడు పీజీ విద్యార్థినిగా ప్రవేశాల కోసం వచ్చానని చెప్పి కళాశాల ప్రాంగణాల్లోకి ప్రవేశించి,వసతి గృహాలను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ విద్యార్థుల ల్యాప్టాప్లను దొంగతనం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.2025 డిసెంబర్ 31న కురగల్లు గ్రామంలోని అమృత విశ్వవిద్యాపీటం బాలుర వసతి గృహంలో మూడు ల్యాప్టాప్లు, అదే రోజు ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో రెండు ల్యాప్టాప్లు దొంగతనం చేసిన ఘటనపై కేసు నమోదు అయింది.
అనంతరం గోవాలోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో తొమ్మిది ల్యాప్టాప్లు, ఒక ప్రయాణ పెట్టె దొంగతనం చేశాడు.2026 ఫిబ్రవరి 2న విజయవాడ బస్టాండ్ లో భద్రత గదిలో ల్యాప్టాప్లు ఉంచి, విట్, కేఎల్ యు, కళాశాలల్లో దొంగతనాలకు సిద్ధమవుతున్న క్రమంలో ఎర్రబాలెం డాన్ బాస్కో పాఠశాల సమీపంలో మంగళగిరి గ్రామీణ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు..నిందితుడు ల్యాప్టాప్ దొంగతనాలను వ్యసనంగా మార్చుకొని, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మహానగరాల్లో విక్రయించినట్లు స్వచ్ఛందంగా ఒప్పుకున్నట్లు ఆయన తెలిపారు.కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన మంగళగిరి గ్రామీణ సీఐ ఏ.వి. బ్రహ్మం, గ్రామీణ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్, ఎస్సై రవి తేజ, ఏఎస్ఐ రత్న రాజు, హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, హెడ్ కానిస్టేబుల్ చలమ రావు,పోలీస్ సిబ్బంది సాగర్, నాగుల్, మీరాలను నార్త్ సబ్ డివిజన్ డిఎస్పి మురళీ కృష్ణ అభినందించారు.




