రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వైఎస్ జగన్
విజయవాడలో రూట్ మార్చాలంటూ పోలీసులు నోటీసులు జారీ
అంబటి పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైసీపీ ఆరోపణ
ముందే రూట్ మ్యాప్ ఇచ్చినా ఆంక్షలు విధించారంటూ ఆగ్రహం.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ విజయవాడ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ సిద్ధమవుతున్న తరుణంలో, పర్యటన మార్గాన్ని మార్చాలని విజయవాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
వివరాల్లోకి వెళితే, జగన్ శుక్రవారం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసానికి వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం తాడేపల్లి నుంచి కనకదుర్గ వారధి, ఫ్లైఓవర్ మీదుగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే, పర్యటనకు ఒక రోజు ముందు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ స్వయంగా ఈ మార్గంలో వెళ్లవద్దని, వేరే దారిలో వెళ్లాలని సూచిస్తూ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.




