బాపట్ల: బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న కె. వెంకటరమణ (57 సం.లు) ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తెనాలిలోని హరిత హాస్పిటల్ నందు గుండెపోటుతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహాన్ని ఫిబ్రవరి 5వ తేదీ గురువారం పొన్నూరు మండలం గాయంవారి పాలెం లోని వారి స్వగృహం నందు ఉంచగా, బాపట్ల సబ్ డివిజన్ ఇన్చార్జ్ డిఎస్పీ (సిసిఎస్ డిఎస్పీ) పి. జగదీష్ నాయక్ గారు
బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ ఆర్. రాంబాబు గారు, ఇతర పోలీసు అధికారులు, సహ ఉద్యోగులు పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .
వెంకటరమణ గారు 1990 సంవత్సరంలో కానిస్టేబుల్గా పోలీస్ శాఖలోకి ప్రవేశించి ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించి ఏఎస్ఐగా పదోన్నతి పొంది ప్రస్తుతం బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ అకాలంగా స్వర్గస్తులైనారు.
ఏఎస్ఐ వెంకటరమణ గారి మృతి పట్ల జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. పోలీస్ యూనిఫామ్ ధరించిన ప్రతి వ్యక్తిదీ ఒకటే కుటుంబమని, ఏఎస్ఐ గారు అస్మాత్తుగా మరణించడం కుటుంబ సభ్యులలోని వ్యక్తిని కోల్పోవడమేనని తెలిపారు.
ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని, శాఖాపరంగా కుటుంబానికి రావాల్సిన అన్ని రకాల పరిహారాలు మరియు రాయితీలు సకాలంలో అందించడానికి కృషి చేస్తామని తెలిపారు.
తీవ్ర శోకసంద్రంలో ఉన్న వెంకటరమణ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి, దగ్గరుండి పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించాలని డిఎస్పీ జగదీష్ నాయక్ గారిని, బాపట్ల పట్టణ ఇన్స్పెక్టర్ రాంబాబును ఎస్పీ గారు ఆదేశించారు.
జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏఎస్ఐ పార్థివ దేహానికి పోలీస్ అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. మట్టి ఖర్చుల నిమిత్తం రూ.1,00,000/- నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గాయంవారి పాలెం సమీపంలో గల స్మశాన వాటికలో పోలీస్ శాఖ అధికార లాంఛనాలతో ఏఎస్ఐ పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
#Narendra




