రాజధాని అమరావతిలో రహదారులు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కరించండి
సీఆర్డీఏ అడిషనల్ సెక్రటరీకి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు విన్నపం
రాజధాని అమరావతి ప్రాంతంలో వేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల మధ్య, స్థానిక ప్రజలు ప్రయాణికులు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, గుంటూరు జిల్లా కార్యదర్శి మాల్యాద్రి నేతృత్వంలోని బృందం శుక్రవారం సీఆర్డీఏ అడిషనల్ సెక్రటరీ భార్గవ్ తేజను కలిసింది.ఈ సందర్బంగా ముప్పాళ్ళ పలు సమస్యలను అడిషనల్ సెక్రటరీ భార్గవ్ తేజ కు వివరిస్తూ రాజధాని ప్రాంతంలో పెరిగిన రద్దీకి అనుగుణంగా తక్షణమే నిధులు కేటాయించి
అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. గుంటూరు నుంచి అమరావతి రోడ్డులో తాడికొండ అడ్డరోడ్డు నుండి రాయపూడి వరకు భారీ గుంతలు పడటం వల్ల ద్విచక్ర వాహనదారులు, ఉద్యోగులు తీవ్ర ప్రమాదాలకు గురవుతున్నారు.
భారీ వాహనాల రాకపోకలు పెరిగిన దృష్ట్యా, ఈ రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని కోరారు. ప్రస్తుతం రాజధాని రోడ్లపై కనీస విద్యుత్ దీపాలు లేవు. దీనివల్ల రాత్రి సమయాల్లో ప్రయాణం ప్రాణాంతకంగా మారుతోంది. గ్రామాలను కలిపే లింకు రోడ్లతో పాటు ప్రధాన రహదారులన్నింటికీ సోలార్ లైట్లు ఏర్పాటు చేసి వెలుగులు నింపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి నుంచి తుళ్ళూరు వెళ్లే దారిలో మద్దూరు వాగుపై సగంలో ఆగిపోయిన బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయాలని కోరారు.
లాం గ్రామం వద్ద కొండవీటివాగు పొంగినప్పుడు రాకపోకలు నిలిచిపోయి ప్రాణనష్టం జరుగుతోందని, అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఎత్తైన బ్రిడ్జి నిర్మించాలన్నారు. తాడికొండ – కంతేరు మార్గంలో ఎర్రవాగుపై కొత్త బ్రిడ్జి నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మంగళగిరి – ఎర్రబాలెం – కృష్ణాయిపాలెం – రాయపూడి రోడ్డును అత్యవసరంగా విస్తరించాలని సూచించారు.
కృష్ణాయిపాలెం నుంచి ఉండవల్లి సెంటర్ వరకు తాడికొండ నుండి జాతీయ రహదారి వరకు ఉన్న మార్గాలను అభివృద్ధి చేయాలన్నారు. వడ్డమాను, అనంతారం, నెక్కల్లు, పెద్దపరిమి, నీరుకొండ, నిడమర్రు గ్రామాలను కలిపే రోడ్లను భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా వెడల్పు చేయాలని కోరారు. రాజధాని మాస్టర్ ప్లాన్లో భాగంగా పలు గ్రామాల్లో స్మశాన వాటికల కొరత ఏర్పడిందని,ముఖ్యంగా వెంకటపాలెం, మందడం, మల్కాపురం వంటి గ్రామాలకు స్మశాన వాటికల కోసం తగినంత స్థలం కేటాయించి, వాటిని ఆధునీకరించాలని ముప్పాళ్ల కోరారు.
సీపీఐ నాయకుల వినతిపై సానుకూలంగా స్పందించిన అడిషనల్ సెక్రటరీ భార్గవ్ తేజ, రాజధానిలో ప్రజల ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని, నిధుల కేటాయింపు పనుల అమలుపై త్వరలోనే స్పష్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాజధాని ప్రాంత ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, జిల్లా నాయకులు పచ్చల సాంబశివరావు, ముప్పాళ్ళ శివశంకరరావు, గుంటుపల్లి వెంకటేశ్వరరావు షేక్ నాగూర్ మీరావాలి కంభంపాటి దేవుని దయ, బెజవాడ యాకోబు తదితరులున్నారు




