సహకార స్ఫూర్తితో కొండపల్లి బొమ్మకు సరికొత్త శోభ*
– *కళాకారులు ఐక్యంగా అడుగులు వేసి కళను కాపాడుకుందాం*
– *ఎక్స్పీరియన్స్ సెంటర్ కళా తేజస్సుకు సరైన వేదిక*
– *గ్రామీణ కళాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి*
– *ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ*
కొండపల్లి బొమ్మల కళాకారుల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడంతో పాటు ఈ కళను తరతరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు కృషిచేస్తున్నామని.. ఇదేవిధంగా కళాకారులు కూడా సహకార స్ఫూర్తితో ఐక్యంగా అడుగులు వేసి కళను మరింత విశ్వవ్యాప్తం చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ పిలుపునిచ్చారు.
కలెక్టర్ డా. జి.లక్ష్మీశ శనివారం కొండపల్లి ఎక్స్పీరియన్స్ సెంటర్లో హస్తకళాకారుల సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. శతాబ్దాల చారిత్రక ఔన్నత్యమున్న కొండపల్లి బొమ్మకు మరింత ప్రాచుర్యం తెచ్చేందుకు చేయీచేయీ కలపాల్సిన అవసరముందని.. కళాకారులు ఐక్యంగా ముందడుగు వేస్తే కళకు మరింత వైభవం వస్తుందని పేర్కొన్నారు.
ఇందుకు కళాకారులు ముందుకొచ్చారు. ప్రభుత్వ కృషిని సద్వినియోగం చేసుకుంటూ కళకు కొత్త జీవం తెస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని, ప్రభుత్వ కృషిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కొండపల్లి బొమ్మలు కేవలం కళాకృతులు మాత్రమే కాదని.. మన ఘన సాంస్కృతిక వారసత్వ సంపదకు ప్రతీకలని, సామూహిక శక్తితో ఆర్థిక స్థిరత్వం తద్వారా కళ వైభవ వ్యాప్తి విస్తృతమవుతుందన్నారు. కొత్త డిజైన్లకు సంబంధించి కూడా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంతో పాటు దేశ, విదేశాలలో ప్రత్యేక గుర్తింపు పొందిన కొండపల్లి బొమ్మల ఔన్నత్యాన్ని నేటి తరానికి చాటిచెప్పేలా, భవిష్యత్తు తరాలకు వారసత్వ సంపదగా అందించేందుకు ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ అభివృద్ధితో పాటు కొండపల్లిని ఒక మోడల్ గ్రామీణ సృజనాత్మక ఆర్థిక కేంద్రంగా మార్చడానికి చొరవచూపుతున్నామన్నారు. కొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, బ్రాండింగ్, ఎస్హెచ్జీ వ్యవస్థాపకత వంటి వాటికి ఉపయోగపడుతుందని, గ్రామీణ కళాత్మక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
సమావేశంలో జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, కొండపల్లి బొమ్మల కళాకారుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు




