బెయిల్ పై ఉన్న జోగి రమేశ్ కు మరో షాక్
జగన్ పర్యటన సందర్భంగా న్యూసెన్స్ క్రియేట్ చేశారంటూ కేసు
పోలీసుల ఆంక్షలను ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసిన ఎస్సై
కల్తీ మద్యం కేసులో ఇటీవలే బెయిల్ పై బయటకు వచ్చిన మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ కు మరో షాక్ తగిలింది. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. Cr.No.76/2026 U/s 223, 189(2), 292, 125(2), 126(2), 132 r/w 190 BNS & Sec 32 of Police Act & Sec 7(1)(a) of Criminal Law Amendment Act: ( 143, 188, 290, 336, 341, 353 r/w 149 IPC) సెక్షన్ల కింద కేసు నమోదయింది.
కేసు వివరాల్లోకి వెళితే… జోగి రమేశ్ ను పరామర్శించేందుకు వైసీపీ అధినేత జగన్ నిన్న ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా బైక్ ర్యాలీలు, పబ్లిక్ న్యూసెన్స్, జన సమీకరణ చేశారని ఎస్సై రవి వర్మ ఫిర్యాదు చేశారు. రోడ్లు బ్లాక్ చేశారని, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ప్రజలను రెచ్చగొట్టేలా ప్రవర్తించారని తెలిపారు. జన సమీకరణ, ర్యాలీలు చేపట్టవద్దని కఠిన నిబంధనలు విధించినా… వాటిని ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో కూడా జోగి రమేశ్ పై మరో కేసు నమోదయింది. పోలీసులు విధించిన ఆంక్షలకు విరుద్ధంగా అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారంటూ పోలీసులు కేసు పెట్టారు. సెక్షన్ 223, 189 క్లాజ్ 2, 292, 125క్లాజ్ 2, 126క్లాజ్ 2, 132, 190, బీఎన్ఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో జోగి రమేశ్ ను మళ్లీ అరెస్ట్ చేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది.




