చలాన్లకు బదులు హెల్మెట్ ‘అప్పు’: మల్కాజిగిరి పోలీసుల వినూత్న ప్రయోగం

0
0

హైదరాబాద్ :  ద్విచక్రవాహనదారుల ప్రాణాలను రక్షించాలనే లక్ష్యంతో మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ బ్యాంక్ పేరుతో వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.

సోమవారం ప్రారంభమైన ఈ కార్యక్రమం మంగళవారం బేగంపేట ప్రాంతంలో అమలులోకి వచ్చింది. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ, హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులను గుర్తించి వారి వివరాలు నమోదు చేసి, వారికి హెల్మెట్‌ను అప్పుగా ఇస్తామని తెలిపారు. 24 గంటల లోపు కొత్త హెల్మెట్ కొనుగోలు చేసి, అప్పుగా తీసుకున్న హెల్మెట్‌ను తిరిగి హెల్మెట్ బ్యాంక్‌లో జమ చేయాలని సూచించారు.

రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం ద్విచక్రవాహనదారుల మరణాలు హెల్మెట్ లేకపోవడం వల్లనే జరుగుతున్నాయని తమ అధ్యయనంలో తేలిందన్నారు. తనిఖీల సమయంలో హెల్మెట్ ధరించకపోవడానికి కొందరు హడావిడిలో ఇంట్లో మరిచిపోయామని, జుట్టు రాలిపోతుందనే భయంతో, లేదా తల–మెడ నొప్పుల కారణంగా ధరించడం లేదని వివిధ సాకులు చెబుతున్నారని వెల్లడించారు.

అవగాహన కార్యక్రమాలతో పాటు ఇప్పుడు ఈ హెల్మెట్ బ్యాంక్న ద్వారా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చలానా విధించడం మాత్రమే కాకుండా, ప్రాణ రక్షణపై అవగాహన పెంచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వాహనదారుడిని గుర్తించి వివరాలు నమోదు చేసి హెల్మెట్‌ను అప్పుగా ఇస్తామని, 24 గంటల తరువాత అదే హెల్మెట్‌ను బ్యాంక్‌లో తిరిగి జమ చేయాలని డీసీపీ రాహుల్ రెడ్డి స్పష్టం చేశారు.

రానున్న రోజుల్లో అల్వాల్, తిరుమలగిరి ప్రాంతాల్లో కూడా ఈ హెల్మెట్ బ్యాంక్‌ను విస్తరించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు, బేగంపేట ఆర్‌ఎస్‌ఐ అశోక్ రెడ్డి, తిరుమలగిరి, సీఐ సర్దార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju
Alwal