మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 7వ వార్డు పరిధిలో ఉన్న గంగయ్య బస్తీ వాసుల దశాబ్దాల కలను నెరవేరుస్తూ, అక్కడ త్వరలోనే నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడతామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రకటించారు.
35 ఏళ్ల క్రితం ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారడంతో, బస్తీ వాసుల విజ్ఞప్తి మేరకు ఎమ్మెల్యే సోమవారం అక్కడ పర్యటించారు.
తిరుమలగిరి తహసీల్దార్ భిక్షపతితో కలిసి బస్తీలోని శిథిలమైన ఇళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్తీ వాసులందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తే, పాత ఇళ్లను కూల్చివేసి ఆధునిక వసతులతో ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చించి, అధికారుల సమన్వయంతో త్వరలోనే భూమి పూజ చేసి, నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే స్వయంగా వచ్చి తమ సమస్యను గుర్తించడమే కాకుండా, కొత్త ఇళ్లు నిర్మిస్తామని చెప్పడంతో బస్తీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పర్యటనలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు సరిత, మురళీ ముదిరాజ్, జూలియస్ పాస్టర్ మరియు ఇతర ముఖ్య నాయకులు ఉన్నారు.
#sidhumaroju
Alwal










