పర్యావరణ పరిరక్షణకు కఠిన చర్యలు తప్పవు: సొసైటీ మద్దతు.

0
0

కాకినాడ: రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం ఇంకా కొనసాగుతుండటం ఆందోళనకర విషయమని న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించినప్పటికీ కొంతమంది వ్యాపారులు ఇంకా ప్లాస్టిక్ కవర్లు విక్రయించడం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని వారు పేర్కొన్నారు.
ఇటీవల కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మున్సిపల్ అధికారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలపై తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వ్యాపారిపై రూ.4,000 జరిమానా విధించడం పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న సానుకూల చర్యగా న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ అభినందించింది.
ప్లాస్టిక్ వ్యర్థాలు నేల, నీరు, జీవవైవిధ్యానికి హానికరమని, భవిష్యత్ తరాలకు ఇది తీవ్రమైన ప్రమాదంగా మారుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నందున ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు సంబంధిత అధికారులు మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు అధికారికంగా తగిన చర్యలు తీసుకోవాలని న్యూ మాన్ చారిటబుల్ సొసైటీ బృందం విజ్ఞప్తి చేసింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మరియు వ్యాపారులు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని మానుకుని బట్ట సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని వారు పిలుపునిచ్చారు.