డీప్‌ఫేక్‌లపై అప్రమత్తంగా ఉండాలి: ప్రజలకు హైదరాబాద్ సీపీ సజ్జనర్ అవగాహన సందేశం |

0
0

హైదరాబాద్ : డిజిటల్‌ యుగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో రూపొందుతున్న డీప్‌ఫేక్‌ వీడియోలు, ఫొటోల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి .సజ్జనర్ ఐపీఎస్ సూచించారు.
ఈ మేరకు ఆయన ప్రజలకు అవగాహన కల్పించే సందేశాన్ని విడుదల చేశారు.
ఏఐ సాంకేతికతను ఉపయోగించి నిజంలా కనిపించే నకిలీ వీడియోలు, ఫొటోలను సైబర్ నేరగాళ్లు సృష్టించి సోషల్‌ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.
అలాంటి కంటెంట్‌ను చూసిన వెంటనే నమ్మకుండా ముందుగా జాగ్రత్తగా పరిశీలించాలని ప్రజలను హెచ్చరించారు.
డీప్‌ఫేక్‌ వీడియోలు లేదా ఫొటోలను నిశితంగా గమనిస్తే లైటింగ్‌లో తేడాలు, ముఖ కవళికల్లో సహజత్వం లేకపోవడం, కదలికల్లో అసహజత్వం వంటి లక్షణాల ద్వారా అవి నకిలీ అని గుర్తించవచ్చని సీపీ సజ్జనర్ పేర్కొన్నారు.
ఏదైనా వీడియో లేదా ఫొటోపై అనుమానం వచ్చినప్పుడు వెంటనే రివర్స్‌ ఇమేజ్‌ సెర్చ్‌ చేయడం ద్వారా ఆ కంటెంట్ అసలు ఎక్కడిదో తెలుసుకోవచ్చని సూచించారు.
వాస్తవాలను నిర్ధారించుకోకుండా భావోద్వేగానికి లోనై ఇతరులకు ఫార్వార్డ్ చేస్తే సమాజంలో అశాంతికి కారణమయ్యే ఫేక్ న్యూస్ వ్యాప్తిలో మనమూ భాగస్వాములు అవుతామని హెచ్చరించారు.
కాబట్టి సోషల్‌ మీడియాలో ఏదైనా వీడియో లేదా ఫొటోను షేర్‌ చేసే ముందు “ఆలోచించండి – నిర్ధారించుకోండి – తర్వాతే షేర్ చేయండి” బాధ్యతాయుతమైన విధానాన్ని పాటించాలని హైదరాబాద్ సీపీ ప్రజలకు సూచించారు.
డీప్‌ఫేక్‌ల యుగంలో విమర్శనాత్మక ఆలోచన, సమాచారాన్ని ధృవీకరించే అలవాటు ప్రతి పౌరుడికి అత్యంత ముఖ్యమైన రక్షణగా మారిందని ఆయన తెలిపారు.
#sidhumaroju
Alwal