ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరం, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపింది.
ముఖ్యంగా శుక్రవారం (మార్చి 20) దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వడగళ్ల వాన పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని సమయాల్లో గాలి వేగం గంటకు 60 కిలోమీటర్లకు చేరవచ్చని అప్రమత్తం చేసింది.
ఇక ఉత్తర కోస్తాంధ్ర, యానాంలోనూ శుక్రవారం చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది. ఈ ప్రాంతంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వివరించింది.
ఉపరితల ఆవర్తనంతో పాటు గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడు మీదుగా కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో మరో ద్రోణి విస్తరించి ఉండటం కూడా ఈ వర్షాలకు కారణంగా అధికారులు పేర్కొన్నారు. రాబోయే రెండు, మూడు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉష్ణోగ్రతల్లో మొదటి మూడు రోజులు పెద్దగా మార్పులు ఉండవని, ఆ తర్వాత స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని తెలిపారు.










