రాష్ట్రంలో వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ కొరత లేదు
• నెల రోజుల్లో లక్ష పీఎన్జీ కనెక్షన్లు లక్ష్యం
• 24 గంటల్లో పీఎన్జీ కనెక్షన్ లకు అనుమతులు ఇస్తాం.
• అపార్ట్మెంట్ లు, వాణిజ్య వర్గాలు పీఎన్జీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
• పర్యావరణ హితం,ధర తక్కువ కాబట్టి పీఎన్జీ సదుపాయంపై అవగాహన పెంచుకోవాలి.
• దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీ కి మారే విధంగా అవకాశం కల్పిస్తున్నాం.
• సోషల్ మీడియా లో మాత్రమే గ్యాస్, పెట్రోల్ కొరత అంటూ అబద్ధాలు ప్రచారం
• ప్రజలు పుకార్లను నమ్మవద్దు.. ఆందోళన చెందవద్దు.. రాష్ట్రంలో సరిపడా నిల్వలు ఉన్నాయి.
• రాష్ట్రంలోని అన్ని అంగన్ వాడీలకు ఇండక్షన్ స్టవ్ లు అందిస్తున్నాం.
• వంట గ్యాస్, పెట్రోల్, డిజిల్ బ్లాక్ మార్కెట్ కు పాల్పడితే కఠిన చర్యలు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మాత్యులు నాదెండ్ల మనోహర్.
అమరావతి,మార్చి 26: రాష్ట్ర
వ్యాప్తంగా నెల రోజుల్లో లక్షకు పైగా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు,ఆహారం, వినియోగదారుల వ్యవహారాల శాఖామాత్యులు నాదెండ్ల మనోహర్ తెలిపారు.రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన ముఖ్య నిర్ణయమైన పీఎన్జీ కనెక్షన్లు పెంపుపై ఏపీ సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని విజయవాడ,గుంటూరు, నెల్లూరు,కాకినాడ,విశాఖపట్నం, తిరుపతి తదితర నగర ప్రాంతాల్లోని ఎల్పీజీ సిలిండర్లు వినియోగిస్తున్న వినియోగ దారులను ఆయా నగరాల్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (పిఎన్జీ) వైపు మళ్లించే చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.పిఎన్జీ ద్వారా గ్యాస్ నిరంతర సరఫరా అందుబాటులో ఉండడంతో పాటు అపార్ట్మెంట్లు, పారిశ్రామిక యూనిట్లు ఈ సదుపాయాన్ని వినియోగిస్తే కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభిస్తాయని వివరించారు.
అలాగే ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి,విజయవాడ కనకదుర్గ దేవస్థానం,శ్రీ కాళహస్తి, అన్నవరం,సింహాచలం దేవాలయాల్లో కూడా పీఎన్జీ కనెక్షన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.అంతేకాకుండా అన్న క్యాంటిన్లకు కూడా పీఎన్జీ కనెక్షన్లు అందించాలన్న నిర్ణయం తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పీఎన్జీ కనెక్షన్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు.అందులో భాగంగానే పీఎన్జీ కనెక్షన్లకు దరఖాస్తు చేసుకున్న అపార్ట్ మెంట్లు,హోటళ్లు తదితర కమర్షియల్ యూనిట్లు, పారిశ్రామిక యూనిట్లకు 24 గంటల్లో కనెక్షన్లు మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.అవసరమైతే ఆటోమేటిక్ అనుమతి వ్యవస్థను అమలు చేస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం జీఎస్టీ 5 శాతం నుండి 25 శాతంకు పెంచడం వల్లే పీఎన్జీ వినియోగంపై వినియోగదారులు ఆసక్తి చూపలేదని మంత్రి నాదెండ్ల మనోహర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.దీపం సబ్సిడీ పథకాన్ని పీఎన్జీ వినియోగదారులకు కూడా వర్తింపజేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దీపం పథకం కింద నాలుగు నెలలకు ఒకసారి ఉచిత సిలిండర్ అందిస్తుండగా, పిఎన్జీ వినియోగదారులకు నిబంధనల మేరకు రెండు నెలలకు ఒకసారి సబ్సిడీ ప్రయోజనం అందే విధంగా మార్పులు చేయనున్నట్లు వెల్లడించారు. మూడు సిలిండర్లకు సంబంధించిన రూ.2400 డిబిటి మొత్తాన్ని పీఎన్జీ వినియోగదారులకు బదిలీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 94 లక్షల దీపం పథకం లబ్ధిదారులు ఉన్నారన్నారు.
సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వదంతులను ఖండిస్తూ,రాష్ట్రంలో ఎక్కడా గ్యాస్ కొరత లేదని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.ప్రస్తుతం ప్రతి రోజూ సుమారు 2 లక్షల 70 వేల గ్యాస్ సిలిండర్లు సరఫరా జరుగుతున్నాయని చెప్పారు. అయితే గ్యాస్ కొరత అంటూ సోషల్ మీడియాలో వదంతులు ప్రచారం కావడంతో వినియోగదారులు అవసరం లేకపోయినా గ్యాస్ సిలిండర్ లు బుక్ చేయడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయన్నారు.కాని నేడు పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు.సాధారణంగా రోజుకు 2.70 లక్షల నుండి 2.80 లక్షల సిలిండర్లు డెలివరీ అవుతున్నాయని, ఒక్కో రోజు 3.30లక్షల సిలిండర్లు కూడా డెలివరీ చేశామని వివరించారు. గ్యాస్,ఆయిల్ బ్లాక్ మార్కెట్ కు పాల్పడినా,ధరలు పెంచి అమ్మకాలు చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరవ్ గౌర్ పాల్గొన్నారు.
(జారీ చేసిన వారు: సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ ఆంధ్రప్రదేశ్ సచివాలయం)










