ఎమ్మిగనూరు ప్రాంతానికి చెందిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ (APCO)లో విలీనం చేయాలనే ప్రతిపాదనను తక్షణమే పునఃపరిశీలించి నిలిపివేయాలని కోరుతూ, కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ పార్లమెంట్ సభ్యురాలు
శ్రీమతి బుట్టా రేణుక గారు గౌరవ జిల్లా కలెక్టర్ డా. ఎ. సిరి, ఐఏఎస్ గారిని మరియు గౌరవ సంయుక్త కలెక్టర్ నూరుల్, ఐఏఎస్ గారిని కలిసి ఈరోజు అధికారిక వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా బుట్టా రేణుక గారు మాట్లాడుతూ, ఎమ్మిగనూరు వీవర్స్ సొసైటీల చేనేత వస్త్ర విక్రయ కేంద్రాలను ఆప్కోలో విలీనం చేయడం అనేది చేనేతల అస్తిత్వం, స్వావలంబన, ఆర్థిక స్థిరత్వంపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయమని స్పష్టం చేశారు. స్వర్గీయ పద్మశ్రీ డాక్టర్ మాచాని సోమప్ప గారు తమ దూరదృష్టితో ఏర్పాటు చేసిన వీవర్స్ కో-ఆపరేటివ్ సొసైటీలు చేనేతలకు స్వయం ఆధారిత వ్యవస్థను అందించాయని, వేలాది కుటుంబాలకు స్థిరమైన ఉపాధి కల్పించాయని పేర్కొన్నారు. అలాంటి వ్యవస్థను బలోపేతం చేయాల్సిందే గానీ విలీనం ద్వారా బలహీనపరచకూడదని తెలిపారు.










