చీరాల జాతీయ రహదారిపై పోలీసులు ముమ్మర తనిఖీలు

0
2

బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు చీరాల పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు రాత్రిపూట ముమ్మర తనిఖీలు నిర్వహించారు. డి.ఎస్.పి మోయిన్, సీఐ సుబ్బారావుల పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్సై పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి రహదారిపై ప్రయాణించే లారీలు, బస్సులను నిలిపి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వాహనదారులకు డ్రైవర్లకు ఎస్సై పవన్ కుమార్ పలు భద్రతా సూచనలు చేశారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే ట్రావెల్స్ బస్సులు, లారీలు ముందుగా వాహన ఫిట్నెస్‌ను సరిచూసుకోవాలని, కండిషన్‌లో ఉన్న వాహనాలతోనే ప్రయాణించాలని సూచించారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాపాయం సంభవిస్తుందని, అటువంటి పనులకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

రాత్రి వేళల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు నిద్ర వస్తున్నట్లు అనిపిస్తే, వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపి, ముఖం కడుక్కుని కాసేపు విశ్రాంతి తీసుకోవాలని తెలిపారు. అజాగ్రత్తగా వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాల పట్ల అప్రమత్తం చేశారు. ప్రతి వాహనదారుడు తమ వెంట వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను కచ్చితంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు.

రహదారి ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్సై పవన్ కుమార్ హెచ్చరించారు.