స్టేడియాలు ఓపెన్ పబ్‌లా?.. కాన్సర్ట్‌ల తర్వాత చెత్త రాజ్యం.|

0
15

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో క్రీడా మైదానాల వినియోగంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్‌ల తర్వాత స్టేడియాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. క్రీడాకారుల సాధనకు ఉద్దేశించిన మైదానాలు ఇప్పుడు ఓపెన్ పబ్‌లుగా మారిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కాన్సర్ట్‌తో ప్రారంభమైన ఈ ట్రెండ్, ఇటీవల అనిరుద్ రవిచందర్ లైవ్ షో, మూడు రోజుల క్రితం ఇలయరాజా సంగీత విభావరి వరకు కొనసాగింది. ఈ కార్యక్రమాలన్నీ గచ్చిబౌలి స్టేడియం ను వినోద కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చాయి.

ఈ భారీ ఈవెంట్ల తర్వాత స్టేడియంలో కనిపించిన దృశ్యాలు మాత్రం తీవ్ర నిరాశ కలిగిస్తున్నాయి. బీరు సీసాలు, మద్యం బాటిళ్లు, ప్లాస్టిక్ వ్యర్థాలు మైదానమంతా పేరుకుపోవడంతో పరిశుభ్రత పూర్తిగా దెబ్బతింది. క్రీడలకు అనువైన వాతావరణం లేకుండా పోతుందని క్రీడాకారులు వాపోతున్నారు.

ఇదే పరిస్థితి ఎల్.బి. స్టేడియం లోనూ కనిపిస్తోంది. ఒకప్పుడు క్రీడా పోటీలకు ప్రసిద్ధి చెందిన ఈ స్టేడియం ప్రస్తుతం సినిమా షూటింగ్లు, మ్యూజిక్ కాన్సర్ట్‌లు, క్రిస్మస్ వేడుకలు, ఇఫ్తార్ విందులు, రాజకీయ సభలు, కుల సమావేశాలకు వేదికగా మారింది.

ప్రత్యేకంగా మద్యం వినియోగం నియంత్రణ లేకుండా సాగుతుండటంతో స్టేడియాలు ఓపెన్ పబ్‌లుగా మారుతున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి వల్ల మైదానాలు చెత్తాచెదారంతో నిండిపోతూ, క్రీడాకారుల సాధనకు పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి.

క్రీడాభివృద్ధి కోసం నిర్మించిన ఈ వేదికలు వినోద కార్యక్రమాలకు మాత్రమే పరిమితమవుతాయా?  లేక క్రీడాకారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

#sidhumaroju

Alwal