వైసీపీ అధినేత వైఎస్ జగన్కు రాజకీయ స్థిరత్వం లేదని, రాజధాని విషయంలో ఆయన పూటకో మాట మాట్లాడారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని, ఆయన పిచ్చి ఆలోచనల వల్లే వైసీపీ 11 సీట్లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిన్న జరిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని చెప్పిన జగన్, అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ మాట మార్చారని అనగాని గుర్తుచేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అని ఒకసారి, అధికారం కోల్పోయాక నాగార్జున యూనివర్సిటీ ప్రాంతం చాలని మరోసారి అన్నారు. ఇలాంటి వైఖరి వల్లే ప్రజలు తిరస్కరించారు. ఓట్లు వేయలేదన్న కోపంతో జగన్ ఇప్పుడు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు, అని మంత్రి ఆరోపించారు.
చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి విషయంలో రాజీ పడదని స్పష్టం చేశారు. ఫ్రీహోల్డ్ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని, వివాదాస్పద 22ఏ భూముల జాబితాపైనా త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.










