వజ్రమ్మ హత్య కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ నమోదు చేయాల్సిందే – జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశం
హైదరాబాద్: 14 సంవత్సరాల క్రితం చీరాలలో జరిగిన బెజ్జం వజ్రమ్మ హత్య కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డే రామచందర్రావు, డైరెక్టర్ సునీల్ కుమార్ శుక్రవారం హైదరాబాద్లోని దిల్ కుష్ గెస్ట్ హౌస్లో విచారణ జరిపారు. 2012లో జరిగిన ఈ హత్యను సాధారణ మరణంగా చిత్రీకరించి, ఎస్సీ, ఎస్టీ యాక్ట్ వేయకుండా నిందితులను రక్షించే ప్రయత్నం చేశారన్న ఫిర్యాదుపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
-
పోలీసుల వైఫల్యం: 14 ఏళ్లుగా ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ఎందుకు అమలు చేయలేదని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ను కమిషన్ ప్రశ్నించింది. కుల ప్రస్తావన లేదన్న అధికారుల వాదనను కమిషన్ తప్పుబట్టింది.
-
లీగల్ ఒపీనియన్ పై మండిపాటు: నిందితుల కులానికి చెందిన వారే లీగల్ ఒపీనియన్ ఇచ్చి కేసును నీరుగార్చడంపై సభ్యులు మండిపడ్డారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు.
-
నిర్ణయం: వచ్చే రెండు నెలల్లోగా ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ యాక్ట్ 3(2)v సెక్షన్లను చేర్చి, పునర్విచారణ జరపాలని, కేసును ఎస్సీ, ఎస్టీ కోర్టుకు బదిలీ చేయాలని కమిషన్ ఆదేశించింది.
ఈ విచారణలో బాధితురాలి సోదరుడు బెజ్జం రత్నకుమార్, దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు, ప్రొఫెసర్ జి.వి. రత్నాకర్ తదితరులు పాల్గొని అధికారుల అరాచకాలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను మే నెలకు వాయిదా వేశారు.










