చీరాలలో ఘనంగా ఈస్టర్ వేడుకలు, సమాధుల తోటల్లో ప్రత్యేక ప్రార్థనలు.

0
3

చీరాల

లోకరక్షకుడైన యేసుక్రీస్తు పునరుత్థానాన్ని పురస్కరించుకొని చీరాల పట్టణంలో ఈస్టర్ పండుగ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. మరణాన్ని జయించి యేసుక్రీస్తు మూడవ రోజున తిరిగి లేచారనే నమ్మకంతో క్రైస్తవ సోదరులు ఈ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు.

సమాధుల చెంత ఆత్మీయుల స్మరణ ఈ సందర్భంగా చీరాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్మశాన వాటికతో పాటు పట్టణంలోని పలు చోట్ల ఉన్న సమాధుల తోటలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. తమను విడిచి వెళ్లిన ఆత్మీయులు కూడా పరలోకమందున్న దేవుని చెంతకు చేరుకుంటారనే ప్రగాఢ విశ్వాసంతో కుటుంబ సభ్యులు ఈ క్రతువులో పాల్గొన్నారు. సమాధులను రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.

ప్రతి సమాధి వద్ద కుటుంబ సభ్యులు గుమిగూడి, పాస్టర్ల ద్వారా ప్రత్యేక ప్రార్థనలు చేయించుకున్నారు. తమ పూర్వీకుల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ క్యాండిల్స్ సమర్పించారు. యేసుప్రభువు మరణించి తిరిగి లేచినట్లే, తమ ప్రియతమ వ్యక్తులు కూడా పరలోక రాజ్యంలో నిరంతరం జీవిస్తారని క్రైస్తవులు తమ నమ్మకాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పట్టణంలోని అన్ని స్మశాన తోటలో భక్తి మార్గంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని తలపించాయి.