మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పెట్రోల్ బంక్ వద్ద గ్యాస్ నింపుకునే క్రమంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారి, ఒక యువకుడి కంటిపై తీవ్ర గాయానికి దారితీసింది. బాధితుడు నిశాని జితేందర్ అందించిన వివరాల ప్రకారం ఘటన ఇలా ఉంది.
మచ్చబొల్లారం, కొత్తబస్తీకి చెందిన నిశాని జితేందర్ (21), తన తండ్రి శ్రీపతి మరియు తమ్ముడితో కలిసి తమ ప్యాసింజర్ ఆటో (TS10UB5761)లో గ్యాస్ నింపుకోవడానికి కనాజిగూడలోని అల్వాల్ పెట్రోల్ బంక్కు వెళ్లారు. మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఆటోను క్యూలో నిలిపి ఉంచగా, జితేందర్ తండ్రి భోజనం కోసం సమీపంలోని హోటల్కు వెళ్లారు.
మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో నంబర్ ప్లేట్ లేని ఒక ఆటో క్యూ పద్ధతిని పాటించకుండా మధ్యలోకి దూసుకువచ్చింది. దీనిని ప్రశ్నించిన జితేందర్పై ఆ ఆటోలో వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడికి దిగారు.
ఈ క్రమంలో ఒక నిందితుడు పదునైన ఆయుధంతో జితేందర్ ఎడమ కంటిపై బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమైంది. గొడవను ఆపడానికి ప్రయత్నించిన జితేందర్ తండ్రి శ్రీపతిపై కూడా వారు దాడి చేశారు.
బాధితుడిని వెంటనే చికిత్స నిమిత్తం జి.ఎన్.ఆర్ (GNR) ఆసుపత్రికి తరలించారు.
జితేందర్ ఎడమ కంటికి వైద్యులు నాలుగు కుట్లు వేశారు. ఎటువంటి కారణం లేకుండా తమపై దాడి చేసిన గుర్తు తెలియని నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
#sidhumaroju
Alwal










