మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వాల్మీకి నగర్లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉద్రిక్తతలకు దారి తీసింది. విగ్రహాన్ని యథావిధిగా తిరిగి ప్రతిష్టించకపోతే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గట్టిగా హెచ్చరించారు.
శుక్రవారం వాల్మీకి నగర్ కమ్యూనిటీ హాల్ ముందు నుంచి తొలగించిన అంబేద్కర్ విగ్రహం, కూల్చివేసిన గద్దె పరిసరాలను బక్కి వెంకటయ్య స్వయంగా పరిశీలించారు.
అనంతరం బస్తీ వాసులు, సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. విగ్రహాన్ని కంటోన్మెంట్ బోర్డు అధికారులు తొలగించారని స్థానికులు వివరించగా, వెంటనే స్పందించిన కమిషన్ చైర్మన్ కంటోన్మెంట్ బోర్డు ఇంజనీర్ ఫణికుమార్కు ఫోన్ చేసి సోమవారం లోపు విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించాలని ఆదేశించారు.
అలా చేయకపోతే కఠిన చర్యలు తప్పవని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అదే విధంగా మల్కాజ్గిరి డీసీపీ శ్రీధర్ను సంప్రదించి ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
“ఏప్రిల్ నెల మహనీయుల పండుగల నెల. అలాంటి సమయంలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడం, గద్దె కూల్చివేయడం తీవ్ర అవమానం” అని బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.
అధికారులు స్వాధీనం చేసుకున్న అంబేద్కర్ విగ్రహాన్ని తక్షణమే తిరిగి ప్రతిష్టించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి.శంకర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్యతో పాటు పలువురు దళిత నాయకులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు.
#sidhumaroju










