ప్రముఖ నేపథ్య గాయని, జాతీయ అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ శ్రీమతి ఆశా భోంస్లే గారి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భారతీయ సంగీత ప్రపంచంలో స్వర్ణయుగాన్ని సృష్టించిన ఆశా భోంస్లే గారి మృతి దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
దశాబ్దాల పాటు అనేక భాషల్లో తన అసమాన గాత్ర మాధుర్యంతో, అపూర్వమైన బహుముఖ ప్రజ్ఞతో భారతీయ సంగీత రంగాన్ని సమృద్ధిగా చేసిన ఆశా భోంస్లే గారి సేవలు చిరస్మరణీయమని ముఖ్యమంత్రి గారు కొనియాడారు. ఆశా భోంస్లే గారు సృష్టించిన కళా వారసత్వం, స్వర మాధుర్యం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తూనే ఉంటాయని తెలిపారు.
ఆశా భోంస్లే గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులకు ముఖ్యమంత్రి గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ సంతాపాన్ని వ్యక్తంచేశారు.





