విశాఖపట్నం: సోమవారం తెల్లవారుజామున విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నరసన్నపేట నుంచి విశాఖపట్నం పూర్ణ మార్కెట్కు గోవులను రహస్యంగా తరలిస్తున్న వ్యాన్, పాత డైరీ ఫారం వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తితో పాటు కొన్ని గోవులు మృతి చెందాయి. సోమవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నరసన్నపేట నుంచి బయలుదేరిన వ్యాను, విశాఖపట్నం పాత డైరీ ఫారం వద్దకు రాగానే అదుపుతప్పి ఓ వ్యక్తిని ఢీ కొట్టి బోల్తా పడింది. వ్యాను ఢీకొట్టడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యానులో అక్రమంగా తరలిస్తున్న కొన్ని గోవులు కూడా ఈ ప్రమాదంలో చనిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై, అలాగే గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.