హైదరాబాద్: ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ, ప్రజలకు వాస్తవాలను తెలియజేస్తున్న జర్నలిస్టులపై కక్ష పూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గం అని టియుడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్ అన్నారు. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 19(1) ఏ మీడియా స్వేచ్ఛ హక్కును హరించే దిశగా ఇటు ప్రభుత్వం అటు పోలీసులు ఇలాంటి అక్రమ కేసులు బనాయించి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను రిపోర్టు చేస్తున్న ఖమ్మం జిల్లా టి.న్యూస్ బ్యూరో చీఫ్ సాంబశివ రావు పై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడాన్ని టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతిసాగర్, తెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్ లు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టు సాంబశివ రావు పై అక్రమ కేసుకు నిరసనగా సోమవారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అనంతరం రాష్ట్ర డీజీపీ జితేందర్ ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టి.న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ ఈ సాంబశివరావు పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరారు. ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ నమోదు చేశారని డీజీపీకి తెలిపారు. తాను కేసు వివరాలు తెలుసుకొని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని డీజీపీ తనను కలిసిన జర్నలిస్టు సంఘం నాయకులకు హామీ ఇచ్చారు. ట్యాంక్ బండ్ వద్ద నిరసన తెలిపి, డీజీపీని కలిసిన వారిలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి పి. యోగానంద్, యార నవీన్ కుమార్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు రాకేశ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సోమేశ్వర్, కోశాధికారి బాబురావు, రాష్ట్ర నాయకులు సూరజ్ భరద్వాజ్, శివారెడ్డి, శ్రీధర్ ప్రసాద్, భాస్కర్,
చిన్న పత్రికల సంఘం అధ్యక్షుడు బిజిగిరి శ్రీనివాస్,అగస్టిన్ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి పొంగులేటిని కలిసి వినతి.
జర్నలిస్టు సాంబశివరావు పై నమోదు చేసిన అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని టి యు డబ్ల్యూ జే నాయకులు సచివాలయంలో కలిసి కోరారు. దీనిపై స్పందించిన మంత్రి ఒకటి రెండు రోజుల్లో దీనిపై పూర్తి వివరాలు తెలుసుకొని జర్నలిస్టుకు న్యాయం జరిగేలా చూస్తారని హామీ ఇచ్చారు.
Sidhumaroju