*Press Release*
మంగళగిరి ఎన్టీఆర్ భవన్ లో మంత్రి లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్
వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరణ
సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని హామీ
మంగళగిరి: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి నుంచి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు.
ఆర్టీసీలో మెడికల్ అన్ ఫిట్ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు తగిన ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని బాధితులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు అనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయితే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని 2015లో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది.
వైసీపీ హయాంలో సర్క్యులర్ ను అమలుచేయకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. 6వేలకు పైగా ఓటింగ్ కలిగిన అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం కొండూరు పంచాయతీని విభజించాలని గ్రామస్థులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు.
టీడీపీ సానుభూతిపరులమనే కక్షతో వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే కాపు రామచంద్రరావు ప్రోద్బలంతో తమపై నమోదు చేసిన అక్రమ కేసులను రద్దు చేయాలని అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవులదట్ల గ్రామానికి చెందిన గొల్ల బ్రహ్మానందం విజ్ఞప్తి చేశారు.
ప్రకాశం జిల్లా పెదరావిపాడులో తమ రెండున్నర ఎకరాల భూమిని వైసీపీకి చెందిన బి.నాగిరెడ్డి, బి.శివరామిరెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని ముండ్లమూరు మండలం నాయుడుపాలెంకు చెందిన ఎమ్.శారదాంబ, ఎమ్.సునీత కోరారు. ఆయా అర్జీలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
