కర్నూలు : నంద్యాల : డోన్
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ పరిధి లోని కొత్తకోట గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో భాగంగా డోన్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పాల్గొని రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ ఫోటోతో ముద్రించబడిన పాత పాసుపుస్తకాల్లో అనేక సాంకేతిక లోపాలు ఉండటంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వాటన్నింటినీ సరిదిద్దుతూ ఇప్పుడు పూర్తిగా పారదర్శకమైన విధానంలో నూతన పాసుపుస్తకాలను రూపొందించామని చెప్పారు.
ఈ నూతన పట్టాదారు పాసుపుస్తకాలపై కేవలం ప్రభుత్వ రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ (QR Code) మాత్రమే ఉంచడం ద్వారా ఎలాంటి రాజకీయ చిహ్నాలు లేకుండా రూపొందించామని, వెబ్ ల్యాండ్ డేటాతో అనుసంధానం చేయడం వల్ల భూమి వివరాలపై సంపూర్ణ నమ్మకాన్ని రైతులకు కల్పించనున్నాయని పేర్కొన్నారు.
రీ-సర్వే పూర్తయిన రాష్ట్రవ్యాప్తంగా 6,688 గ్రామాల్లోని సుమారు 21.80 లక్షల మంది రైతులకు ఈ పాసుపుస్తకాలను స్థానిక గ్రామ సభల ద్వారా రెవెన్యూ సిబ్బంది అందజేయనున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ మొత్తం పర్యవేక్షణతో, నిబంధనలకు అనుగుణంగా అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
రైతుల భూమి హక్కులను కాపాడడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, భవిష్యత్తులో కూడా రైతు సంక్షేమానికి మరిన్ని సంస్కరణలు తీసుకురావడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు,కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.




