తాడేపల్లిలో ఆగని మట్టి మాఫియా: లారీ ఢీకొని యువకుడికి గాయాలు.. స్థానికుల ఆందోళన!
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ మట్టి రవాణా యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి అనుమతులు లేకుండా పట్టపగలే నల్ల మట్టి లారీలు రోడ్లపై స్వైరవిహారం చేస్తున్నాయి. ఈ క్రమంలో బ్రహ్మానందపురంలో చోటుచేసుకున్న ప్రమాదం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.
ఉండవల్లి ప్రాంతం నుండి మట్టి తరలింపునకు అనుమతులు లేనప్పటికీ, రవాణాదారులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఎర్రబాలెం మీదుగా బ్రహ్మానందపురం చేరుకుని, అక్కడి నుండి హైవే ద్వారా విజయవాడ, ఇప్పటం, మెల్లెంపూడి వంటి ప్రాంతాలకు భారీగా మట్టిని తరలిస్తున్నారు. కేవలం రాజధాని గ్రామాలకు మాత్రమే మట్టి తరలింపునకు అనుమతులు ఉన్నట్లు తెలుస్తున్నా, ఆ ముసుగులో ఇతర ప్రాంతాలకు వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
ఉదయం బ్రహ్మానందపురంలో అతివేగంగా వెళ్తున్న ఒక మట్టి లారీ ఓ యువకుడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడటంతో ఆగ్రహించిన స్థానికులు మట్టి లారీలను అడ్డుకున్నారు.
నిత్యం వందల సంఖ్యలో లారీలు తిరుగుతుండటంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత అధికారులు దీని పై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు




