Home South Zone Andhra Pradesh సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

సభకు రాకుండా రోడ్లపై మాట్లాడతారేంటి?: స్పీకర్ అయ్యన్నపాత్రుడు.

0

రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
సభలో లేవనెత్తే ప్రతి అంశానికి మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించడం తన బాధ్యతని వెల్లడి

మీడియా సమాజహితం కోసం పనిచేయాలని సూచన

శాసనసభకు గైర్హాజరువుతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో చర్చలు జరగకుండా.. రోడ్లపై మాత్రమే విమర్శలు, ప్రతికూల వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్రం, ప్రజల పక్షాన నిజంగా చర్చించాలనుకుంటే వారు సభకు రావాలని సూచించారు. సభలో లేవనెత్తే ప్రతి అంశానికి మంత్రుల ద్వారా సమాధానం ఇప్పించడం తన బాధ్యతని స్పష్టం చేశారు.

రోడ్లపై జరుగుతున్న ఈ గుద్దులాట సంస్కృతి ఏంటో అర్థం కావడం లేదని స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీనే సరైన వేదిక అని అన్నారు. ఇదే సమయంలో నో వర్క్.. నో పే విధానంపై అయ్యన్న మరోసారి స్పందించారు. ఈ విధానాన్ని ఎమ్మెల్యేలకూ అమలు చేయాలని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధంగా ఇందుకు ఉన్న అవకాశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

ప్రస్తుత రాజకీయ వాతావరణంలో తనలాంటి మనస్తత్వం ఉన్నవారికి రాజకీయాలు సూట్ కావడం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనుకున్నానని, ఇంకా కొనసాగిస్తే గౌరవం కూడా మిగిలే పరిస్థితి ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. అదేవిధంగా విశాఖలో భూముల ధరలు పెరగడం, గతంలో రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఫిర్యాదులు లేకపోవడం వంటి అంశాలపై కూడా ఆయన స్పందించారు. పాత్రికేయుల బాధ్యతలపై ప్రస్తావిస్తూ.. మీడియా సమాజహితం కోసం పనిచేయాలని సూచించారు. వక్రీకరణల ద్వారా అసలు విషయం పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

NO COMMENTS

Exit mobile version