చీరాల: చీరాల పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లోని పలు పెట్రోల్ బంకుల్లో నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది, నిర్వాహకులు ప్రమాదకరంగా సెల్ఫోన్లను వినియోగిస్తున్నట్లు నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు పెట్రోల్ కొట్టించే సమయంలో సెల్ఫోన్లు ఉపయోగించరాదని హెచ్చరికలు చేయాల్సిన సిబ్బందే స్వయంగా ఫోన్లు వాడుతూ విధులు నిర్వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
పెట్రోల్ బంకులోకి ప్రవేశించే సమయంలో ద్విచక్ర వాహనదారులు కూడా ఫోన్లు ఆపకుండానే ఇంధనం కొట్టించుకుంటుండటం సాధారణంగా మారింది. ఈ విషయాన్ని ప్రశ్నించినప్పుడు, కొందరు సిబ్బంది “ఫోన్ పే ద్వారా వచ్చిన చెల్లింపులు సరిగా వచ్చాయా లేదా అని చూసేందుకు ఫోన్ ఉపయోగిస్తున్నాం” అంటూ సమాధానం చెబుతున్నారని స్థానికులు తెలిపారు. అయితే ఇప్పటికే పెట్రోల్ బంకుల్లో స్కానర్లు, ఏటీఎం కార్డ్ మిషన్లు, డిస్ప్లే యంత్రాలు ఉన్నప్పటికీ ఫోన్ల వినియోగం కొనసాగడం నిబంధనల ఉల్లంఘనగా పేర్కొంటున్నారు.
కొంతమంది సిబ్బంది పెట్రోల్ కొడుతూనే ఫోన్లో మాట్లాడటం, కస్టమర్లతో ఫోన్ చేతిలో పెట్టుకుని సంభాషణలు సాగించడం వంటి ఘటనలు రోజూ కనిపిస్తున్నాయని ప్రజలు అంటున్నారు. ఇప్పటివరకు చీరాల పరిసర ప్రాంతాల్లో పెద్ద ప్రమాదాలు జరగకపోవడంతో ప్రమాద తీవ్రతపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మన ప్రాంతాల్లో ఘటనలు జరగకపోయినా, చుట్టుపక్కల ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో జరిగిన అగ్ని ప్రమాదాలు, భారీ నష్టాలు ప్రజలకు తెలుసని వారు గుర్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇబ్బంది పడే కన్నా, ముందస్తు జాగ్రత్తలుగా సెల్ఫోన్ వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేయాలని కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, పెట్రోల్ బంకుల్లో నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు సిబ్బంది, వాహనదారులపై అవగాహన కల్పించకపోతే భవిష్యత్తులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని నగర ప్రజలు హెచ్చరిస్తున్నారు.
#Narendra
