బొల్లారం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఎంపీ ఈటల రాజేందర్ పచ్చజెండా

0
1

హైదరాబాద్ (బొల్లారం): మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని చారిత్రాత్మక బొల్లారం రైల్వే స్టేషన్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. బొల్లారం స్టేషన్‌లో రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793/12794) కు కల్పించిన తొలి నిలుపుదల (First Halt) కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా.. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “బొల్లారం రైల్వే స్టేషన్‌కు స్వాతంత్ర్యానికి పూర్వమే గొప్ప చరిత్ర ఉంది. దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే సైనికుల రాకపోకలకు ఇది ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇంతటి ప్రాధాన్యం ఉన్న స్టేషన్ ప్రస్తుతం కనీస సౌకర్యాలకు నోచుకోకపోవడం బాధాకరం” అని ఆవేదన వ్యక్తం చేశారు.
బొల్లారం స్టేషన్‌ను ‘అమృత్ స్టేషన్’ పథకం కింద అన్ని హంగులతో మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలని తాము కేంద్ర రైల్వే శాఖను డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

సికింద్రాబాద్, కాచిగూడ వంటి ప్రధాన స్టేషన్లు ప్రస్తుతం విపరీతమైన రద్దీతో (Congestion) ఇబ్బంది పడుతున్నాయని, నగరంలో రైళ్లను నిలిపేందుకు తగిన స్థలం లేక ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని ఎంపీ వివరించారు. ఈ రద్దీని తగ్గించడానికి బొల్లారం వంటి స్టేషన్లను ప్రత్యామ్నాయ టెర్మినల్స్‌గా అభివృద్ధి చేయడం అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదే క్రమంలో బీజేపీ రాష్ట్ర సోషల్ మీడియా సభ్యురాలు కరుణశ్రీ కందుకూరి, విశాఖ, నాగవళి, నగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల నిలుపుదలపై మరియు ప్లాట్‌ఫారమ్ సౌకర్యాలపై ఎంపీ గారికి వినతి పత్రాన్ని అందించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

#Sidhumaroju
Alwal