మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో “హెల్మెట్ బ్యాంక్” (Helmet Bank) కార్యక్రమాన్ని శుక్రవారం అధికారికంగా ప్రారంభించారు.
ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, వారికి జరిమానా విధించడమే కాకుండా, పోలీసుల వద్ద ఉన్న హెల్మెట్ బ్యాంకు నుండి ఒక హెల్మెట్ను తాత్కాలికంగా అందజేస్తారు. ఈ హెల్మెట్ పొందిన వాహనదారులు 24 గంటల వ్యవధిలో తమ కోసం కొత్త హెల్మెట్ను కొనుగోలు చేసి, పోలీసుల వద్ద తీసుకున్న హెల్మెట్ను తిరిగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో అప్పగించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా మల్కాజిగిరి ట్రాఫిక్-1 డీసీపీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ మాట్లాడుతూ.. వాహనదారుల ప్రాణాలను కాపాడటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాంతక ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ, లక్ష్మి, తిరుమలగిరి ట్రాఫిక్ ఏసీపీ జి. శంకర్ రాజు, ఇన్స్పెక్టర్ వి. సర్దార్ నాయక్, బేగంపేట అదనపు ఇన్స్పెక్టర్ జి. జానకి రాములు, ఆల్వాల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ సిహెచ్. శంకరయ్య మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
ఇప్పటికే ఈ కార్యక్రమం బేగంపేటలో విజయవంతంగా నడుస్తోందని, త్వరలోనే ఆల్వాల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దీనిని అమలు చేస్తామని అధికారులు వెల్లడించారు.
#sidhumaroju
Alwal
