తూర్పు గోదావరి జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేశ్వరం మండలం మర్రివీడు, కంబాలపాలెం పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు పులిని బంధించేందుకు చర్యలు చేపట్టినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ తెలిపారు. పులి కదలికలపై అధికారులు నిరంతరం నిఘా ఉంచుతున్నారని ఆమె పేర్కొన్నారు.
ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా రాత్రిపూట బయటకు రావడం, ఒంటరిగా ప్రయాణాలు చేయడం నివారించాలని తెలిపారు. చిన్నపిల్లలు మరియు పశువులను కూడా జాగ్రత్తగా చూసుకోవాలని గ్రామస్థులకు సూచించారు.
అటవీశాఖ అధికారులు గ్రామ పరిసర ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి పులిని పట్టుకునేందుకు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని కోరారు.










