మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ పత్రాలను విక్రయిస్తున్న ముఠాను అల్వాల్ పోలీసులు బట్టబయలు చేశారు.
ఆల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం… నమ్మదగిన సమాచారం మేరకు, ఈనెల 15న సాయంత్రం అల్వాల్ సబ్ ఇన్స్పెక్టర్ కె. చంద్రశేఖర్ తన బృందంతో కలిసి తెలుగు తల్లి విగ్రహం సమీపంలోని ‘శ్రీదేవి జిరాక్స్ & నోటరీ’ షాపుపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ సమయంలో షాపులో పనిచేస్తున్న ముంద్రాతి నగేష్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
“ముందస్తు సంతకాలతో అక్రమ దందా..”
పోలీసుల తనిఖీలో షాపులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అడ్వకేట్ డి. రాజేందర్ రావు (బొల్లారం), డాక్టర్ డి. రవికుమార్ పేర్లతో ఉన్న నోటరీ సీళ్లు, వారి సంతకాలతో కూడిన ఖాళీ అఫిడవిట్లు భారీగా లభ్యమయ్యాయి.
ఇవే కాకుండా కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఓబీసీ (Annexure-B), ఈడబ్ల్యూఎస్ (EWS), నాన్-క్రీమీ లేయర్ అఫిడవిట్లను ముందే సిద్ధం చేసి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల వివరాలు..షాపు యజమాని దుండిగల్ రాజేశ్వర్, అతని కుమారుడు అఖిల్ కుమార్ సూచనల మేరకే తాను ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు నగేష్ విచారణలో వెల్లడించాడు.
ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు వసూలు చేస్తూ ఈ నకిలీ పత్రాలను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్నవి..భారీ సంఖ్యలో సంతకాలు చేసిన ఖాళీ అఫిడవిట్లు. నోటరీ స్టాంపులతో గ్రీన్ పేపర్లు, వివిధ పేర్లతో ఉన్న దరఖాస్తులు, అక్రమ వసూళ్లకు సంబంధించిన ఖాతా పుస్తకాలు.
ఈ మేరకు పోలీసులు పంచనామా నిర్వహించి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రాజేశ్వర్, అఖిల్ కుమార్, నగేష్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రజలు ఇలాంటి నకిలీ పత్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
#sidhumaroju
Alwal










