“మల్కాజిగిరి పోలీసుల ‘బ్లాక్ ఆపరేషన్’.. ఒక్కరోజే 627 వాహనాలపై వేటు!”

0
17

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్మ్ మరియు టింటెడ్ గ్లాస్ ఉపయోగిస్తున్న వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను మరియు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

మల్కాజిగిరి ట్రాఫిక్ డిసిపి-1 రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో తిరుమల గిరి మరియు మల్కాజిగిరి డివిజన్ల పరిధిలో ఈ డ్రైవ్ కొనసాగింది.

ఈ తనిఖీల్లో పోలీసులు విస్తుపోయే గణాంకాలను నమోదు చేశారు.

కేవలం ఒక్కరోజులోనే నిబంధనలు అతిక్రమించిన 627 వాహనాలపై కేసులు నమోదు చేయగా, ఉల్లంఘనదారుల నుంచి మొత్తం రూ. 4,38,900 జరిమానాగా వసూలు చేశారు.

కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, వాహనాలకు ఉన్న నల్లటి ఫిల్మ్‌లను పోలీసులు అక్కడికక్కడే తొలగించి నిబంధనల పట్ల కఠినంగా వ్యవహరించారు.

వాహనాల లోపల జరిగే అసాంఘిక కార్యకలాపాలకు నల్లటి అద్దాలు ఒక రక్షణ కవచంలా మారుతున్నాయని, ఇది ప్రజా భద్రతకు పెద్ద ముప్పు అని పోలీసులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నిఘా కెమెరాల పనితీరుకు కూడా ఇవి అడ్డంకిగా మారుతున్నాయని వారు వివరించారు.

వాహనదారులు స్వచ్ఛందంగా అనధికారిక ఫిల్మ్‌లను తొలగించుకోవాలని, లేనిపక్షంలో మున్ముందు ఈ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని పోలీసులు హెచ్చరించారు.

#sidhumaroju