మహబూబాబాద్, మే 3(ఈమాట):: నర్సింహులపేట మండలంలో గ్యాస్ కొరకు బుక్ చేసి పదిహేను రోజులు దాటినా సిలెండర్ రాక పోవడంతో….. ఆదివారం గ్యాస్ లారీ వస్తుందని సమాచారం తెలుసుకున్న వినియోగదారులు ఎదురు చూస్తూ అర్ధరాత్రి నుంచే తమ ఖాళీ సిలెండర్లతో గోదాం ముందర నిద్రించారు. తెల్లవారే వరకు లారీ రాకపోవడం, సంబంధించిన నిర్వాహకులు కూడా ఎవరూ లేక పోవడంతో.. సమాధానం చెప్పేవారు ఎవరూ లేరని వినియోగదారులు విసుగు చెంది ఆగ్రహంతో వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారి పై ఖాళీ సిలిండర్లతో ధర్నా నిర్వహించారు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు హుటాహుటిన చేరుకొని వినియోగదారులను శాంతించాలని కోరారు. గ్యాస్ రాక నెల రోజులు అయ్యిందని బుక్ చేసి 15 రోజులైనా ఇవ్వడం లేదని సిబ్బంది వచ్చి సమాధానం చెప్పేంత వరకు ఇక్కడ నుండి కదలమని రోడ్డుపై బైఠాయించారు. ఎంతకూ కదలక పోవడంతో వారిని బలవంతంగా పక్కకు తప్పించారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనాలను పంపించారు.
కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారా..!
సిబ్బంది చేతి వాటంతో కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారని ఆరోపణలు
అందులో పనిచేసే సిబ్బంది ముందుగానే ఖాళీ సిలిండర్లను తీసుకువెళ్తున్నారని ఆన్లైన్లో బుక్ చేసిన వెంటనే ఓటీపీలు చెప్పమని ఫోన్లు చేసి అడుగుతున్నారని అయినా బుక్ చేసిన వారికి ఇవ్వకుండా గ్యాస్ రాలేదంటూ ముందుగానే బ్లాకులో అమ్ముకొని కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.ఏజెన్సీ వారు పదిహేను రోజులైన స్టాక్ ఇండెంట్ ఎందుకు పెట్టడం లేదంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఎక్కడ లేని కొరత నర్సింహులపేట మండలంలో ఎందుకు ఏర్పడుతుందని నిలదీస్తూ దీనిలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.
కనపడని అధికారుల పర్యవేక్షణ
జిల్లాలోని సంబంధించిన సివిల్ సప్లై అధికారులు తనిఖీలు ఎందుకు జరపడం లేదంటూ ఇంత కృత్రిమ కొరత స్పృష్టిస్తున్నా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొన్న యూరియా ,నిన్న పెట్రోల్, ఇవ్వాల గ్యాస్ కష్టాలు తీరడం లేదని ప్రభుత్వ తీరు పై ప్రజలు మండిపడుతూ ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలని గ్యాస్ ను అందించాలని ప్రజలు కోరుతున్నారు.









