Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు… తప్పిన పెను ప్రమాదం.

0
7

Kadapa RTC bus fire: కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు… తప్పిన పెను ప్రమాదం

05-04-2026 Sun 19:43 | Andhra

RTC Bus Fire in Kadapa District All Passengers Safe

 

వైఎస్ఆర్ కడప జిల్లాలో పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. ఓ ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగగా, డ్రైవర్ వేగంగా స్పందించడంతో అందులో ఉన్న 21 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వేంపల్లి మండలం వీరన్నగట్టుపల్లి సమీపంలో చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే, కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 21 మంది ప్రయాణికులతో వేంపల్లి నుంచి కదిరికి బయలుదేరింది. వీరన్నగట్టుపల్లి వద్దకు రాగానే, రోడ్డుకు అడ్డంగా తక్కువ ఎత్తులో వేలాడుతున్న 11 కేవీ విద్యుత్ తీగలు బస్సు పైభాగానికి తగిలాయి. దీంతో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగాయి. బస్సు లోపల పొగలు, మంటలు గమనించిన ప్రయాణికులు భయంతో కేకలు వేశారు.

 

వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులందరినీ హుటాహుటిన కిందకు దించారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే, అప్పటికే బస్సు కాలి బూడిదైంది.

 

విద్యుత్ తీగలు ప్రమాదకరంగా కిందకు వేలాడటమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై వేంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.