టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను అక్రిడిటేషన్ సమావేశాలకు ఆహ్వానించాలి

0
2

రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల సమావేశాలకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులను ప్రత్యేక ఆహ్వానితులుగా పిలవాలని ఆ సంఘం రాష్ట్ర నాయకత్వం ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసింది. జీవో 252 ద్వారా ప్రభుత్వం ఫెడరేషన్ ను గుర్తించినప్పటికీ, సాంకేతిక కారణాలతో రాష్ట్ర, జిల్లాస్థాయి అక్రిడిటేషన్ కమిటీ సమావేశాలకు టీడబ్ల్యూజేఎఫ్ ప్రతినిధులను ఆహ్వానించకపోవడం పట్ల ఆ సంఘం నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఆయా జిల్లాల్లో ఒక సంఘం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ నియామకాల్లో అనవసర జోక్యం | చేసుకుంటుందని విమర్శించారు. జిల్లా కలెక్టర్లు నియమించిన కమిటీలను సైతం ఇష్టానుసారం మార్చడాన్ని ఖండించారు. ఈమేరకు తెలంగాణ మీడియా అకాడమీ ఈ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం సరికాదని వాఖ్యానించారు.

హైదరాబాద్ తోపాటు ఇతర జిల్లాల్లో ఈ తరహా నియామకాలు చేశారని తెలియజేశారు. ఈ నియామకాలను వెంటనే సమీక్షించి తొలుత వేసిన కమిటీలనే | పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇకపోతే ఇండ్లస్థలాల విషయంలో జర్నలిస్టుల సంఘాల అభిపాయాలను ప్రభుత్వం తీసుకోవాలని సూచించారు. ఇటీవల హౌసింగ్ సొసైటీల ప్రతినిధులతో సర్కారు సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామనీ, అదే సందర్భంగా జర్నలిస్టుల సంఘాలను కూడా ఆసమావేశానికి ఆహ్వానించి ఉంటే మరింత ఫలవంతమైన చర్చలు జరిగి ఉండేవన్నారు.

ఇండ్లస్థలాల విషయంలో మరింత చర్చించాలనీ, న్యాయపరమైన, సాంకేతిపరమైన చిక్కులు ఎదురుకాకుండా పంపిణీ చేయాలని కోరారు. నిరంతరం ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు స్పెషల్ కమిషనర్n జీ ముకుందరెడ్డి, ముఖ్యమంత్రి పౌరసంబంధాల అధికారి గుర్రం మల్పూర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు జి మాణిక్ప్రభు, హెచ్ఐయూజే అధ్యక్షులు అరుణ్ కుమార్, నాయకులు మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.